సాధారణ ఎన్నికల కంటే పెద్ద మొత్తంలో డబ్బు స్వాధీనం ఈసీ భన్వర్‌లాల్‌

హైదరాబాద్‌, జూన్‌ 5 (జనంసాక్షి) :

రాష్ట్రంలో జరుగుతున్న 18 స్థానాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో అధిక మొత్తంలో డబ్బు పట్టుబడ్డట్లు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ పేర్కొన్నారు. సాధారణ ఎన్నికల్లో పట్టుబడ్డ దాని కన్నా ఈ మొత్తం ఎక్కువగా ఉందని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు 18 స్థానాల్లో కలిపి రూ.41 కోట్లు స్వాధీనం చేసుకు న్నట్లు భన్వర్‌లాల్‌ వివరించారు. అదే విధంగా బాలకృష్ణ నటించిన ‘అధినాయకుడు’ సినిమాలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన వ్యాఖ్యలు లేవని తెలిపారు. ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించే నాయకులు ఆచితూచి తమ ప్రచారాన్ని సాగించాలని, ఎలాంటి మతపర వ్యాఖ్యలు చేయకూడదని సూచించారు. ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించా రు. అభ్యర్థులు గానీ, వారికి మద్దతిస్తున్న నాయకులు గానీ  చట్ట పరిధిలో ఉన్న అంశాలను కూడా తమ ప్రచారంలో చేర్చవద్దని హితవు పలికారు. మొన్న జరిగిన తిరుపతి సభలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్‌కు పద్నాలుగేళ్ల జైలు శిక్ష పడుతుందని వ్యాఖ్యానించడాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ ఈ సూచన చేయడం గమనార్హం.