అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

ఇటిక్యాల (జనంసాక్షి) అక్టోబర్ 17
మండల పరిధిలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సోమవారం సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పునర్వసు నక్షత్రం సందర్భంగా వేద పండితులు శ్రీ దత్తస్వామి వెంకటస్వామి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు మండల కేంద్రంతో పాటు తిమ్మాపురం, కొండపేట, యాక్తాపురం, ఎర్రవల్లి చౌరస్తా, షేక్ పల్లి, జింకలపల్లి, కొండేరు, కోదండాపురం, సాసనూలు, దువాసిపల్లి, ఆర్. గార్లపాడు పెద్దదిన్నె, పుటాన్దొడ్డి, ధర్మవరం తదితర గ్రామాల నుండి భక్తులు బీచుపల్లి పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. దక్షిణ వాహిని అయినా పవిత్ర కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించి సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. అలాగే ఆలయ పాలకమండలి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు తెలిపారు.