అంబేడ్కర్‌కు బలవంతంగా భారతరత్న ఇచ్చారు: ఓవైసీ

ముంబయి,జనవరి28(జ‌నంసాక్షి): గతంలో భారతరత్న అవార్డును బిఆర్‌ అంబేద్కర్‌కు బలవంతంగా ఇచ్చారు కాని, హృదయపూర్వకంగా ఇవ్వలేదని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని కల్యాణ్‌ నగరంలో నిర్వహించిన వంచిత్‌ బహుజన్‌ సభలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ఎంతమంది దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, పేదలు, అగ్రవర్ణాలైన బ్రాహ్మణులకు భారతరత్న అవార్డులు ఇచ్చారని కళ్యాణ్‌ నగరంలో వంచిత్‌ బహుజన సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత పురస్కారమైన భారతరత్నను మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రముఖ గాయకుడు భూపేన్‌ హజారికా, సామాజికవేత్త నానాజీ దేశ్‌ ముఖ్లకు ఇచ్చిన నేపథ్యంలో అసదుద్దీన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.