అఖిలేశ్ను వెంటాడుతున్న ఈడీ
– గోమతి నది అభివృద్ధి పథకంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు
– తాజాగా నాలుగు రాష్ట్రాల్లో ఈడీ దాడులు
లక్నో, జనవరి24(జనంసాక్షి) : గోమతి నది అభివృద్ధి పథకంలో అక్రమాలు ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ను వెంటాడుతున్నాయి. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కాలంలో చేపట్టిన ఈ పథకంలో అక్రమాలు జరిగినట్లు నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం నాలుగు రాష్టాల్లో సోదాలు నిర్వహించింది.
ఈడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర ప్రదేశ్లోని లక్నో, నోయిడా, హర్యానా, రాజస్థాన్ రాష్టాల్లోన్రి కొన్ని ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. స్థానిక పోలీసుల సహకారంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. సాక్ష్యాధారాలు, దస్తావేజులను పరిశీలిస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం గోమతి నది సుందరీకరణ పనుల పథకంపై దర్యాప్తుకు ఆదేశించడంతో సీబీఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈడీ గత మార్చిలో మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. అలహాబాద్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అలోక్ కుమార్ సింగ్ నేతృత్వంలోని విచారణ కమిటీ కూడా గోమతి నది అభివృద్ధి ప్రాజెక్టులో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. ఈ కమిటీ తన నివేదికను
2017 మే 16న ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా పోలీసులు అదే సంవత్సరం జూన్ 19న కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఏర్పాటైన బీజేపీ వ్యతిరేఖ కూటమిలో అఖిలేష్ యాదవ్కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే యూపీలో త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ధీటుగఆ ఎదుర్కొనేందుకు బీఎస్పీ అధినేత మాయావతి, అఖిలేష్ యాదవ్లు కలిసి పనిచేస్తున్నారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటు కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో ఈడీ అఖిలేష్పై ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేయడం గమనార్హం.