అగ్రవర్ణ రిజర్వేషన్‌లపై..  కేంద్రానికి సుప్రిం నోటీసులు

– ఈనెల 26లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి11(జ‌నంసాక్షి) : అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమంటూ బీసీ సంక్షేమ సంఘం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లపై ఈ నెల 26లోపు సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలకు కేంద్రం సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. మరోవైపు ఆర్‌.కృష్ణయ తన పిటిషన్‌లో కాపులకు అయిదు శాతం రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికగా అమలు చేస్తారో తెలిపాలని కోరారు. కాగాఈబీసీ రిజర్వేషన్లపై గతంలోనూ వ్యాపారవేత్త తెహసిన్‌ పూనావాలా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈబీసీ రిజర్వేషన్ల చట్టంపై న్యాయస్థానం స్టే నిరాకరించింది. ఇక కేంద్ర ప్రభుత్వం అగ్ర కులాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జనరల్‌ కోటాగా ఉన్న 50శాతం నుంచే మరో పదిశాతాన్ని పక్కకు తీసి ఈ రిజర్వేషన్లు కల్పిస్తారు. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో మార్పు ఉండదు.