అదీ మనవాళ్ల సత్తా.. 

– భద్రతా దళాలకు రాజ్‌నాథ్‌ ప్రశంసలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి18(జ‌నంసాక్షి):  పుల్వామా ఉగ్రదాడిలో కీలక సూత్రధారి, జైషే మహ్మద్‌ కమాండర్‌ అబ్దుల్‌ రషీద్‌ ఘాజీ అలియాస్‌ కమ్రాన్‌ను మట్టుబెట్టిన భారత భద్రతా దళాలపై కేంద్ర ¬మంత్రి రాజ్‌నాధ్‌ ప్రశంసలు కురిపించారు. ఉగ్రవాదుల ఏరివేత కోసం ప్రస్తుతం పుల్వామాలో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌పై ఆయన స్పందిస్తూ.. ‘భారత సైనికులకు నిండైన ఆత్మస్థైర్యం ఉందని, తీవ్రవాదులను నిలువరించడంలో వారు విజయవంతంగా దూసుకెళ్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు 40 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న పుల్వామా దాడిలో వారం రోజుల్లోగానే ప్రతికారం తీర్చుకున్న భద్రతా దళాలపై సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. కాగా పుల్వామా జిల్లాలోని పింగ్లాన్‌ ప్రాంతంలో సోమవారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో రషీద్‌ ఘాజీతో పాటు జైషే మహ్మద్‌కు చెందిన మరో ఉగ్రవాదిని కూడా సైన్యం కాల్చి చంపింది. ఉగ్రవాదులు, సైనికుల మధ్య ప్రస్తుతం ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతానికి సవిూపంలో మరో ఉగ్రవాది దాగి ఉన్నట్లు భావిస్తున్న సైనికులు ఓ భవనాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదులను నిలువరించే క్రమంలో ఓ మేజర్‌ సహా నలుగురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు.