అధికారంలోకి వస్తాం.. ఇందిరమ్మ రాజ్యం తెస్తాం

` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి): కాంగ్రెస్‌ నాయకుల ఫోన్లపై పోలీసులు నిఘా పెట్టారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల వేళ వేగులుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. గురువారం నాడు గాంధీభవన్‌లో ఆయన విూడియాతో మాట్లాడుతూ..‘ కాంగ్రెస్‌ నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర డీజీపీని తొలగించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోందన్నారు. సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ఉన్నవారిపై నిఘా పెట్టారు. మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీని, తెలంగాణ పోలీసులను హెచ్చరిస్తున్నా.. కాంగ్రెస్‌కు సాయం చేసేవారిని బెదిరిస్తే ఊరుకునేది లేదని అన్నారు.  బిడ్డా కేటీఆర్‌.. గుర్తు పెట్టుకో. నీ అధికారం 45రోజులే…. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంతకు ఇంత మిత్తితో చెల్లిస్తాం. అరవింద్‌ కుమార్‌, జయేష్‌ రంజన్‌, సోమేశ్‌ కుమార్‌ లాంటి అధికారులు చందాలు ఇవ్వాలని ప్రోత్సహిస్తున్నారు. అధికారులు అధికారుల్లా వ్యవహరించండి… బీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లా కాదని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కేటీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి సాయం చేస్తున్న 75 మంది లిస్టును తయారు చేశారట… ఆ లిస్టును కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌కు ఇచ్చారు. కొంతమందిని కేటీఆరే స్వయంగా బెదిరిస్తున్నారట. కాంగ్రెస్‌ కార్యకర్తలు 45రోజులు అకుంఠిత దీక్షతో పనిచేస్తే అధికారం మనదే.. డిసెంబర్‌ 9వ తేదీన ఇందిరమ్మ రాజ్యం ఏర్పడటం ఖాయం. ఎల్బీ స్టేడియంలో ఆరు గ్యారంటీలపై సంతకం పెట్టడం ఖాయం. తెలంగాణను కేసీఆర్‌ తాగుబోతుల అడ్డాగా మార్చారు. కాంగ్రెస్‌ ఏం చేసిందంటూ బావ, బామ్మర్ధులు నోరు పారేసుకుంటున్నారు. వ్యవసాయానికి ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌ మెంట్‌, ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు వైద్యం అందించింది కాంగ్రెస్‌ కాదా..? కేటీఆర్‌.. విూరు అనుభవిస్తున్న ఈ పదవులు కాంగ్రెస్‌ పార్టీ పెట్టిన బిక్ష.. సోనియమ్మ దయతోనే విూకు మంత్రి పదవులు దక్కాయి. సీఎం కేసీఆర్‌ తెలంగాణకు ఇచ్చిన హావిూలు నెరవేరుస్తారని సోనియాగాంధీ తొమ్మిదేళ్లు ఎదురుచూశారు. 4కోట్ల ప్రజలను మోసగించినట్లే కేసీఆర్‌ సోనియాగాంధీ గారిని మోసం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయి. అందుకే సెప్టెంబర్‌ 17 వ తేదీన సోనియమ్మ ఆరు గ్యారంటీలను ప్రకటించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరతాం. ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఓవైసీ కూడా మోదీ, కిషన్‌రెడ్డి, రాజాసింగ్‌లా మాట్లాడుతున్నారు. నన్ను భాగ్యలక్ష్మీ అమ్మవారిపై ప్రమాణం చేయాలంటున్నారు. భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చేందుకు నేను సిద్ధం… విూరు సిద్ధంగా ఉన్నారా‘ అని రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు.