అధికారులు, పోలీసులు సమన్వయంతో పనిచేసి గణేష్ నవరాత్రులు విజయవంతం చేయాలి:

    మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):   గణేష్ మండపాల ఏర్పాటు, నిమజ్జనం కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లకు, సంఘటనలకు తావివ్వకుండా అందరు అధికారులు, పోలీసులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయవలసినదిగా జిల్లా పొలిసు సూపరింటెండెంట్ రోహిణి ప్రియదర్శిని అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో గణేష్ ఉత్సవాల సంధర్భంగా శాంతిభద్రతల ఏర్పాటుపై సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేష్ లతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బుధవారం వినాయక చవితి సందర్భంగా జిల్లాలో పెద్ద సంఖ్యలో మండపాలు ఏర్పాటు చేయనున్నందున గ్రామ, మండల, మునిసిపల్ వారీగా మండపాలు ఏర్పాటు చేస్తున్న జాబితా తయారు చేసుకొని ఇంచార్జిలుగా సిబ్బందికి విధులు కేటాయించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా అధికారులు మండపాలను, నిమజ్జనం ప్రాంతాలను ముందుగా సందర్శించి విగ్రహాలు ప్రతిష్టించే మండపం వరకు, గణేష్ నిమజ్జనం చేసే చెరువుల వరకు రోడ్డు గుంతల మయం లేకుండా చదునుగా ఉండేలా చూడాలని, స్పీడ్ బ్రేకర్లు తొలగించాలని, విద్యుత్ తీగలు వేలాడకుండా చూడాలని అన్నారు. మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని, అలాగే విద్యుత్ కనెక్షన్ కు అనుమతి తీసుకోవాలని సూచించారు. విగ్రహాలను 3,5,7,9,11 రోజులలో నిమజ్జనం చేస్తారని అందుకనుగుణంగా విద్యుత్, బ్యారికేడింగ్, మంచి నీటి సదుపాయం ఏర్పాటు చేయాలని, అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన ప్రాంతాలలో గజఈతగాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. తూప్రాన్, రామాయంపేట, నరసాపూర్ మునిసిపల్ ప్రాంతాలలో 8న నిమజ్జనం, మెదక్ పట్టణంలో 10న నిమజ్జనం ఉంటున్నందున విద్యుత్ అంతరాయం లేకుండా, తీగలు వేలాడకుండా చూడాలని, జనరేటర్, మైక్ ఏర్పాటు చేయాలని, అగ్ని ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అవసరమైన క్రేన్ లు ఏర్పాటు చేయాలని , రహాదారి వెంట అడ్డం వచ్చిన కొమ్మలు తొలగించాలని, మండపాలు, నిమజ్జన ప్రాంతాలలో పరిశుభ్రత చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామాలలో పంచాయతీ కార్యదర్శుల సహకారంతో నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాలని, ప్రజలు కోవిద్ నిబంధలనలు పాటించేలా అప్రమత్తం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి సూచించారు. మెదక్ పట్టణంలో సెప్టెంబర్ 10 న సాయంత్రం నుండి 11 వ తేదీ వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆబ్కారీ సూపరింటెండెంట్ కు సూచించారు.
         స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ మాట్లాడుతూ ఎక్కడెక్కడ మండపాలు ఏర్పాటు చేస్తున్నారో వివరాలు సేకరించి అందుకనుగుణగా బృందాలు ఏర్పాటు చేసుకొని ఎటువంటి సంఘటనలకు తావివ్వకుండా పకడ్బందీగా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవలసినదిగా అధికారులకు సూచించారు. పంచాయతీ కార్యదర్శుల సహాకారంతో గ్రామాలలో నిమజ్జన కార్యక్రమం విజయవంతం చేయాలని జిల్లా పరిషద్ సీఈఓ, జిల్లా పంచాయతీ అధికారులకు సూచించారు. ఆర్.డి.ఓ.లు, మునిసిపల్ కమీషనర్లు, మండల పరిషద్ అధికారులు తమ పరిధిలో ఉండి సమన్వయంతో పనిచేయాలని కోరారు. మునిసిపల్ ప్రాంతాలలో నిమజ్జనం చేసే రోజు టెంట్ వేసి మంచినేటి సదుపాయం కల్పించాలని, చెరువుల వద్ద 4,5 మంది గజ ఈతగాళ్లను, పెద్ద క్రేన్ లను , లైటింగ్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. విగ్రహం నిమజ్జనం చేసే ముందే నీరు కలుషితం కాకుండా ఆకులు, పూలు చెత్తను వేరు చేసేలా పారిశుధ్య కార్మికులను నియమించాలని అధికారులకు సూచించారు. నిమజ్జనం ముగిసిన తరువాత రోడ్లపై, వీదులలో ఏర్పాటు చేసిన జెండా కర్రలు, బ్యానర్లు తొలగించాలని అన్నారు. సంఘ విద్రోహ శక్తులు సామాజిక మాధ్యమాలలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టి విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తారని, అటువంటి పోస్టులు తమ దృష్టికి తెస్తే వెంటనే బ్లాక్ చేస్తామని అన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రమేష్, విద్యుత్ శాఖ ఎస్.ఈ. జానకిరామ్, జిల్లా పరిషద్ సీఈఓ శైలేష్, డిపిఓ తరుణ్ కుమార్, ఆబ్కారీ శాఖా సూపరింటెండెంట్ రజాక్, అగ్నిమాపక అధికారి అమర్నాథ్ గౌడ్, జిల్లా రవాణాధికారి శ్రీనివాస్ గౌడ్, ఆర్ అండ్ బి, పంచాయత్ రాజ్, నీటిపారుదల శాఖా ఇంజనీరింగ్ అధికారులు, మునిసిపల్ కమీషనర్లు తదితరులు పాల్గొన్నారు.