అధీర్‌ రంజన్‌ ఎపిసోడ్‌తో సమస్యలు పక్కకు

చర్చకు అవకాశం లేకుండా చూస్తోన్న అధికార పక్షం
న్యూఢల్లీి,ఆగస్ట్‌1 జ‌నంసాక్షిః  గతంలో ఎలాంటి సమస్య అయినా చర్చలకు విపక్షాలను అనుమతించేవారు. జవాబులతో పాలకపక్షం పూర్తిగా సంసిద్ధమైరావడం కూడా జరిగేది. అదది అసెంబ్లీ అయినా, పార్లమెంట్‌
అయినా ఇదే సంప్రదాయం కొనసాగింది. బాహాబాహీ యుద్దాలతో తమను తాము నిరూపించుకొనే ప్రయత్నాల వల్ల ప్రయోజనం లేదని తెలిసినా , ఇదే విధానం కోరుకుంటున్నారు. ప్లకార్డులు, నిరసనలు, తగినసమయం కోసం డిమాండ్లు ప్రజాస్వామ్యంలో అంతర్భాగంగా గుర్తించాలి. సభను సజావుగా నడిపే బాధ్యత పాలకపక్షానికి మాత్రమే ఉంది. చర్చకు అవకాశం ఇవ్వకుండా, సమాధానం చెప్పకోవాల్సిన అగత్యం లేకుండా, సస్పెన్షన్ల ద్వారా కొందరిని బయటకు నెట్టి, కీలకమైన బిల్లులను మూకబలంతో ఆమోదింపచేసుకొని సమావేశాలకు స్వస్తిచెప్పాలన్నది అధికారపక్షం ప్రయత్నం. బిల్లులు దొడ్డిదారిన ఆమోదం పొందుతున్నాయంటే అందుకు అధికారపక్షం వైపల్యం తప్పమరోటి కాదు. ఇకపోతే నోటి దురుసు తనంతో కాంగ్రెస్‌ పక్షనేత అధీరం రంజన్‌ పరువు తీసుకున్నాడు. రాష్ట్రపతిగా తొలిసారి ఎన్నికైన గిరిజన మహిళ ద్రౌపది ముర్ము పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి అహంకార ధోరణిని చాటుకున్నారు. ఏ సందర్బంలో ఏం మాట్లాడాలో ముఖ్యం. తరవాత లెంపలేసుకోవడం ద్వారా సమస్య సద్దుమణిగినా వ్యక్తి ఇమేజ్‌ మాత్రం
దెబ్బతింటుంది. నోరుజారాను, క్షమించాలి అంటూ కాంగ్రెస్‌ నాయకుడు అధీర్‌ రంజన్‌ చౌదరి దేశాధ్యక్షురాలు ద్రౌపది ముర్ముకు లేఖ రాయడంతో ఆ వివాదం ముగిసిపోయింది. కానీ దీనిని బిజెపి ఎప్పుడు అవకావం దొరికినా వాడుకుంటుంది. అధధీర్‌ రంజన్‌నే కాదు,మొత్తం కాంగ్రెస్‌నే ఇరుకున పెట్టగలదు. అధికారపక్షం అంత తేలికగా వదలకపోవచ్చును. ఏదో నోరుజారితే ఇంత రాద్దాంతం చేస్తారా
అని కాంగ్రెస్‌ నాయకులు దబాయిస్తున్నప్పటికీ, జరిగింది తప్పేనని ఆ పార్టీ ఒప్పుకోకతప్పలేదు. వివాదాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాకు కూడా చుట్టి, ఆమె కూడా క్షమాపణలు కోరాలని అధికారపక్ష నాయకులు డిమాండ్‌ చేసి,సోనియాను ముగ్గులోకి లాగారు. సోనియా సభలో దురుసుగా వ్యవహరించారన్న అధికారపక్ష నేతల విమర్శకు ప్రతిగా, ఆమె విూద కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యల సంగతేమిటని కాంగ్రెస్‌ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రదర్శిస్తున్న దూకుడు వెనుక, గోవాలో ఆమె కుమార్తెను కాంగ్రెస్‌ ఒక వివాదంలో ఇరికించిన కక్ష ఉన్నదని వారి అనుమానం. అయితే ఇలాంటి విషాయాల్లో పట్టుదలకు పోయిన అధికారపక్షం ధరల పెరుగుదల, జీఎస్టీ బాదుడు, కాంట్రాక్టువిధానాన్ని తెచ్చిపెట్టిన అగ్నిపథ్‌ పథకం, బుల్‌డోజర్‌ విధ్వంసాలు, మతవిద్వేషాలు, పరస్పర దాడులు ఇత్యాది విషయాలపై మాత్రం నోరుమెదపడం లేదు. చర్చలకు ఆస్కారం ఇవ్వడం లేదు.