అభివృద్ది చేసిన టిఆర్‌ఎస్‌నే ఆదరించండి

 

ప్రజాసంక్షేమమే కెసిఆర్‌ లక్ష్యం

తెలంగాణ అభివృద్దికి ఓటుతో మద్దతు ఇవ్వండి: కొప్పుల

ధర్మపురి,నవంబర్‌22(జ‌నంసాక్షి): రాష్ట్రాన్ని నాలుగున్నరేళ్లకాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కెసిఆర్‌ను మరోమారు సిఎం చేసేందుకు ప్రజలంతా మూకుమ్మడిగా టిఆర్‌ఎస్‌కు ఓటేసి గెలిపించాలని ధర్మపురి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ కోరారు. వివిధ గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించగా భారీ స్పందన లభించింది.ప్రజలంతా ఆలోచించి ప్రజా సంక్షేమాన్ని కోరే టీఆర్‌ఎస్‌ పార్టీ గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు చూసి అండగా నిలవాలని కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు.ఎక్కడా లేని విధంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, ప్రభుత్వ పనితీరును చూస్తున్న ప్రజలు కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. మహా కూటమి నాయకులు మోసపూరిత మాటల్ని నమ్మవద్దన్నారు.

ప్రజా సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో నియోజకవర్గంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. అభివృద్ధిలో రాష్ట్ర వ్యాప్తంగా తగిన గుర్తింపు సాధించామన్నారు. ఎప్పుడైన సరే అభివృద్ధి విషయంలో ప్రజల సమక్షంలో బహిరంగ చర్చకు నేను సిద్దమని సవాల్‌ విసిరారు. రానున్న ఎన్నికల్లో సైతం భారీ మెజార్టీ గెలిపిస్తారని నమ్మకం ఉందని తెలిపారు. తెలంగాణ వ్యతిరేక పార్టీలన్ని ఒక్కటై కట్టిన మహాకూటమిని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మలేదనీ, రానున్న ఎన్నికల్లో మహాకూటమికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. అంతకు ముందు ఇంటింటా తిరుగుతూ గ్రామస్తులను కలిసి ఓట్లను ఆభ్యర్థించారు.