అమెరికాలో భారత జంట మృతి

లోయలో పడి దుర్మరణంపై దర్యాప్తు

న్యూయార్క్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): అమెరికాలో జరిగిన ఓ విషాద సంఘటనలో భారత దంపతులు మృతిచెందారు. భారత్‌కు చెందిన దంపతులు విష్ణు విశ్వనాథ్‌(29), విూనాక్షి మూర్తీ(30) 800 అడుగుల లోయలో పడి చనిపోయారు. విష్ణు విశ్వనాథ్‌ సిస్కోలో సిస్టమ్స్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. సహాస యాత్రలంటే అమితంగా ఇష్టపడే ఈ జంట కాలిఫోర్ణియాలోని యాస్మైట్‌ నేషనల్‌ పార్క్‌ సందర్శనకు వెళ్లారు. పార్క్‌లోని ప్రముఖ పర్యాటక పాయింట్‌ అయిన ఓ కొండ శిఖరం విూదకు వెళ్లారు. అక్కడి నుంచి జారి నిటారుగా ఎనిమిది వందల అడుగుల లోయలో పడ్డారు. పార్క్‌ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. దంపతుల మృతికి ఇప్పటికి కారణం తెలియట్లేదన్నారు. అసలు ఏం జరిగిందే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇది ఒక విషాద సంఘటన అని పేర్కొన్నారు. దర్యాప్తు అధికారులు విచారణ చేపట్టారు. దంపతులు ఏ విధంగా లోయలో పడ్డారు.. ఆ సమయంలో ఏం జరిగిందనే అంశాలపై దృష్టి సారించారు. ఈ ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.