అసెంబ్లీలో అక్కా,తమ్ముడి లొల్లి

` రాజకీయ చర్చలతో దద్దరిల్లిన అసెంబ్లీ
` ఫిరాయింపులపై సబితతో ఫిర్యాదును ప్రస్తావించిన సీతక్క
` తనను టార్గెట్‌ చేస్తున్నారంటూ సబిత ఆగ్రహం
` సబిత మోసం చేసింది నిజమే అన్న సీఎం రేవంత్‌
` కాంగ్రెస్‌ను మోసం చేసిన ఘనత మీదే అన్న భట్టి
` దళితుడు విపక్షనేత కాకుండా చేశారని ఆగ్రహం
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాటల యుద్ధంతో ద్దరిల్లింది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో రాజకీయాలుఎ చోటు చేసుకున్నాయి. మొదట.. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ వర్సెస్‌ సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులుగా సుమారు గంటకుపైగానే సభ నడవగా ఆ తర్వాత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రస్తావన వచ్చింది. సభలో పార్టీ మార్పులపై వాడి వేడిగా చర్చ నడుస్తుండగా పెద్ద రచ్చే అయ్యింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇద్దరూ కౌంటర్ల వర్షం కురిపించారు.మంత్రి సీతక్క భారాసపై ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని భారాస నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు పత్రాన్ని కాంగ్రెస్‌లో గెలిచి భారాసలోకి వచ్చిన సబితా ఇంద్రారెడ్డితో ఇప్పించారని ఎద్దేవా చేశారు. భారాస వాళ్లు రాజీనామా చేయించి ఎమ్మెల్యేలను చేర్చుకున్నారా అని ప్రశ్నించారు. ఈక్రమంలో సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు తనను టార్గెట్‌ చేస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డిని.. ఓ అక్కగా కాంగ్రెస్‌లోకి సంతోషంగా ఆహ్వానించినట్లు గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డికి నాపై ఎందుకు కక్ష?. ఆరోజు పార్టీలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్‌ ఆశాకిరణం అవుతావని చెప్పాను. సీఎం అవుతావని కూడా చెప్పాను. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాను అని తెలిపారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సబితక్క నన్ను పార్టీలోకి ఆహ్వానించిన మాట వాస్తవం. వ్యక్తిగతంగా జరిగిన సంభాషణ సభలో చెప్పారు. సబిత సభలో ప్రస్తావించారు కాబట్టే.. అప్పుడు జరిగిన పరిణామాలు సభలో చెప్పాలి. 2019లో మల్కాజిగిరిలో పోటీ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ కోరింది. మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తే అండగా ఉంటానని సబితక్క మాట ఇచ్చారు. కాంగ్రెస్‌ నన్ను అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే ఆమె భారాసలో చేరారు. అధికారం కోసం కాంగ్రెస్‌ను వదిలి భారాసలో చేరి మంత్రి పదవి తీసుకున్నారు. తమ్ముడిగా నన్ను మోసం చేశారు కాబట్టే ఆమెను నమ్మవద్దని కేటీఆర్‌కు చెప్పా. మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తే గెలిపించే బాధ్యత నాదే అని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. నేను చెప్పింది నిజమో.. కాదో.. సబితక్క గుండె విూద చేయి వేసుకుని చెప్పాలని రేవంత్‌ చెప్పారు. ఈ క్రమంలో కేటీఆర్‌ వెనకాల ఉన్న అక్కల మాట వినొద్దని సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు. వెల్‌ లోకి దూసుకొచ్చి ఆందోళన చేశారు. అయితే సీఎం రేవంత్‌ రెడ్డి ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వచ్చారని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డిని తమ్ముడిగా పార్టీలోకి ఆహ్వానించానన్నారు. సీఎం రేవంత్‌ పదే పదే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే స్పీకర్‌ కలుగజేసుకుని సభా నాయకుడిని అగౌరవ పరుస్తున్నారని సబితకు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్‌లో సబితా అనుభవించిన పదవులు మొత్తం అన్నీ ప్రస్తావించారు. ’2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్‌ పార్టీ సబితా ఇంద్రారెడ్డికి అనేక పదవులు ఇచ్చింది. కానీ.. సబితా ఇంద్రారెడ్డి పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరి మోసం చేశారు. ఒక దశాబ్ద కాలం సబితకి మంత్రి పదవి ఇచ్చాం. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాకుంటే సబిత బీఆర్‌ఎస్‌లోకి వెళ్ళారు. కాంగ్రెస్‌ నన్ను సీఎల్పీ లీడర్‌ చేస్తే నా వెనక ఉండాల్సింది పోయి పదవి కోసం సబిత పార్టీ మారారు. ఓ దళితుడికి ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసేందుకు సబిత పార్టీ పదవి వెళ్లారు. పార్టీలు మారి, ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది గాక ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారు. అసలు సబిత ఎందుకు బాధపడుతున్నారో అర్థం కావడం లేదు’ అని భట్టీ ప్రశ్నలు, అంతకుమించి విమర్శల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే స్పీకర్‌ ఒకింత ఆగ్రహానికి లోనయ్యారు. ’కేటీఆర్‌ గారు రెచ్చగొట్టడమే మన పనా..?’ అంటూ కోపంగా స్పీకర్‌ మాట్లాడారు. చర్చ పక్కదోవ పట్టడంతో స్పీకర్‌ సభను వాయిదా వేశారు.