అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించిన డీకే శివకుమార్
ఆగష్టు 22(జనం సాక్షి)కర్ణాటక కాంగ్రెస్లో అధికార మార్పిడి వ్యవహారం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ ను సీఎంగా చూడాలని మెజారిటీ ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ నడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అసెంబ్లీ లో ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించడం ఆసక్తికరంగా మారింది. డీకే చర్యతో బీజేపీ ఎమ్మెల్యేలు ఆశ్చర్యంతో హర్షధ్వానాలు చేశారు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటనపై చర్చ సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక్.. శివకుమార్కు ఆర్ఎస్ఎస్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. దీనికి ప్రతిస్పందనగా డీకే ఆర్ఎస్ఎస్ గీతం ‘నమస్తే సదా వత్సలే’ ఆలపించారు. డీకే ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించడంతో అక్కడున్న బీజేపీ ఎమ్మెల్యేలంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. గట్టిగా బల్లలు చరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సీఎం కుర్చీ ఇవ్వకుంటే తాను బీజేపీలో చేరుతానని కర్ణాటక కాంగ్రెస్కు డీకే హింట్ ఇచ్చారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్ పాటను ఆలపించడంతో అసెంబ్లీలో గందరగోళం, వాగ్వాదం నెలకొంది.