ఆగని పెట్రో మంటలు

పెట్రోలుపై 28 , డీజిల్‌పై 22 పైసలు పెరుగుదల

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): పెట్రో ధరలకు పగ్గాలు పడడం లేదు. మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. వరుసగా రోజూ కొంతమొత్తం చొప్పున పెంచేస్తున్నారు. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ పరుగులు ఆగట్లేదు. రోజువారీ సవరణల్లో భాగంగా శుక్రవారం కూడా చమురు ధరలు పెరిగాయి. దేశ రాజధానిలో గురువారం

రూ. 81ని తాకిన పెట్రోల్‌ ధర.. శుక్రవరాం మరో 28పైసలు పెరిగింది. దీంతో దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 81.28గా ఉంది. ఇక ధరలు అత్యధికంగా ఉండే ముంబయిలో పెట్రోల్‌ ధర రూ.90కి మరింత చేరువైంది. నేడు అక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 88.67గా ఉంది. చెన్నైలో రూ. 84.49, కోల్‌కతాలో రూ. 83.14, హైదరాబాద్‌లో రూ. 86.18గా ఉంది. మరోవైపు డీజిల్‌ ధర కూడా పెరిగింది. దిల్లీలో లీటర్‌ డీజిల్‌ ధర 22 పైసలు పెరిగి రూ.73.30గా ఉంది. ముంబయిలో రూ. 77.82, కోల్‌కతాలో రూ. 75.15, చెన్నైలో రూ. 77.49, హైదరాబాద్‌లో రూ. 79.73గా ఉంది. సెప్టెంబరు 5, సెప్టెంబరు 12 మినహా గత కొన్ని వారాలుగా ప్రతిరోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ముడిచమురు ధరలు పెరగడంతో పాటు ఎక్సైజ్‌ సుంకం ఎక్కువగా ఉండటంతో దేశీయంగా చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆగస్టు మధ్య నుంచి ఇప్పటి వరకు లీటర్‌ పెట్రోల్‌పై రూ. 4.48, డీజిల్‌పై రూ. 4.77 పెరిగింది