ఆగస్టు 4 నుండి కొత్త ఓటరు నమోదు కార్యక్రమం

– సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
కొండపాక (జనంసాక్షి) జులై 30 : ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ద్వారా ఆగస్టు 4వ తేదీ నుండి కొత్తగా ఓటరు నమోదు చేసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జిల్లాలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఓటరు నమోదు స్పెషల్ సమ్మరీ రివిజన్ పై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం ఫారం-6,7,8 లలో స్వల్పమార్పులు గావించిందని, అట్టి మార్పులకు సంబంధించిన ఫారములు 1 ఆగస్టు 2022 నుండి అందుబాటులో ఉంటాయని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రముఖ పాత్ర పోషించేది ఓటు అని 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు అయి ఉండాలనే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా 1 జనవరి 2023, 1 ఏప్రిల్ 2023, 1 జూలై 2023, 1అక్టోబర్ 2023 నాటికి 18 సంవత్సరాల వయసు నిండే యువత కొత్తగా ఓటర్ నమోదు చేసుకోవాలన్నారు. నూతన ఓటర్ నమోదు ఫారం-6 ద్వారా మాత్రమే నమోదు చేసుకోవాలని అన్నారు. ఫారం-8 ద్వారా శాసనసభ నియోజకవర్గంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మరియు ఒక నియోజకవర్గం నుండి మరొక నియోజకవర్గానికి ఓటరు పేరును బదిలీ, ఓటరు కార్డులో పేరు, తండ్రి పేరు, ఇంటి పేరు, చిరునామా, లింగం, తదితర అన్ని రకాల మార్పులు, చేర్పుల కొరకు మరియు డూప్లికేట్ ఎపిక్ కార్డు పొందుటకు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని కానీ ఇది ఐచ్చికమని అన్నారు. దరఖాస్తులను ఎన్నికల బూత్ లెవెల్ అధికారి వద్ద గాని, సంబంధిత మండల తహశీల్దార్ కార్యాలయంలో గాని సమర్పించాలని లేదా నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్, ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. తుది ఓటర్ల జాబితా 5 జనవరి 2023న ప్రకటించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ విషయాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రజలను చైతన్యవంతం చేసి నూతన ఓటరు నమోదు మరియు మార్పుచేర్పులు చేసుకునేలా సహకరించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో రెహమాన్, ఎలక్షన్ డిటి శ్రీనివాస్, రాజకీయ పార్టీల ప్రతినిధులు జి. మోహన్ లాల్ టిఆర్ఎస్, కె.గోపాల స్వామి సిపిఐ, సిహెచ్. రవికుమార్ సిపిఐ (ఎం), ఎండి.మునీరుద్దీన్ ఎంఐఎం, యు.మోహన్ బిఎస్పి తదితరులు పాల్గొన్నారు.