ఆటోని ఢీకొట్టిన విక్రమ్ తనయుడు చియాన్
చెన్నై(జనం సాక్షి ): చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ అర్జున్ రెడ్డి రీమేక్ తో వెండితెర ఆరంగేట్రం చేయనున్న సంగతి తెలిసిందే. బాలా దర్శకత్వంలో వర్మ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల ధృవ్కి సంబంధించి కొన్ని ఫోటోలు బయటకు రాగా ధృవ్ని చూసి మురిసిపోయారు విక్రమ్ అభిమానులు. అయితే ఈ రోజు తెల్లవారుజామున షూటింగ్లో పాల్గొనేందుకు ధృవ్ వెళుతుండగా, ఆయన కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఆటోని ఢీకొట్టింది. వేగంగా వస్తున్న కారు ఆటోని గుద్దడంతో ఆటోలో నిద్రిస్తున్న డ్రైవర్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడట. ధృవ్కి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తుండగా, ఆటోలో ఉన్న వ్యక్తి కాలు విరిగినట్టు సమాచారం. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి ఆరోగ్య పరిస్తితి విషమంగానే ఉందని అంటున్నారు. ఇక ధృవ్ కారు దగ్గరలో ఉన్న గుంటలో ఇరుక్కుపోవడంతో స్థానికులు బయటకు తీశారు. కారు బ్రేకులు ఫెయిల్ కావడం వలనే ఈ ప్రమాదం జరిగిందని కోలీవుడ్ సమాచారం. పాండిబజారులో ఈ సంఘటన జరగగా, దీనిపై పూర్తి దర్యాప్తు జరుపుతున్న పోలీసులు కొద్ది గంటలలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.