ఆర్టీసీ బస్సులోనే ప్రసవం

డెలివరీలో సహాయం చేసిన కండక్టర్‌
అభినందించిన ఎండి సజ్జన్నార్‌
గద్వాల,ఆగస్ట్‌19(జనం సాక్షి): తాను గర్బిణీ అని తెలిసినా… డెలివరీ టైం దగ్గర పడిరదని తెలిసినా సోదరుడికి రాఖీ కట్టేందుకు ఓ సోదరి వెళ్తూ మార్గ మధ్యలోనే ప్రసవించారు. ఆర్టీసీ బస్‌లో ప్రసవ నొప్పులు రాగానే ఆమెను బస్సులో ప్రసవం చేశారు. సోదరుడికి రాఖీ కట్టేందుకు బయల్దేరిన నిండు చూలాలు..
బస్సులోనే ప్రసవించింది. సదరు బస్సులో లేడీ కండక్టర్‌తో పాటు ఓ నర్సు అందుబాటులో ఉండటంతో ఆమెకు దగ్గరుండి డెలివరీ చేయించారు. గద్వాల్‌ నుంచి వనపర్తి వెళ్లే ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. గద్వాల డిపోనకు చెందిన గద్వాల`వనపర్తి రూట్‌ పల్లె వెలుగు బస్సులో సోమవారం ఉదయం సంధ్య అనే గర్భిణి తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తున్నారు. బస్సు నాచహల్లి సవిూపంలోకి రాగానే ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్‌ భారతి బస్సును ఆపించారు. అదే బస్సులో ఉన్న ఒక నర్సు సాయంతో గర్భిణికి పురుడు పోశారు. సంధ్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. 108 అంబులెన్స్‌ను పిలిచి తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. రాఖీ పండుగ నాడు బస్సులో డెలివరీ చేసి ఒక మహిళా కండక్టర్‌ను ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రశంసించారు. మానవత్వం చాటుకున్నారని కితాబు ఇచ్చారు. జరిగిన విషయాన్ని ఎక్స్‌ వేదికగా వివరించారు. ’రక్షాబంధన్‌ రోజున బస్సులో గర్భిణికి పురుడు పోసిన కండక్టర్‌ భారతికి ఆర్టీసీ యాజమాన్యం తరపున అభినందనలు తెలిపారు. తాను సమయస్పూర్తితో వ్యవహారించి నర్సు సాయంతో సకాలంలో పురుడుపోయడం వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతూనే.. సామాజిక బాధ్యతగా సేవాస్ఫూర్తిని ఆర్టీసీ ఉద్యోగులు చాటుతుండటం గొప్ప విషయం.’ అని సజ్జనార్‌ అన్నారు.