ఇండోనేషియాలో భారీ వర్షాలు

జకార్తా,జనవరి23(జ‌నంసాక్షి): దక్షిణ ఇండోనేషియాలో కుండపోత వర్షాలు కురిశాయి. భారీ వర్షంతో కొన్ని ప్రాంతాల్లో నీటిమట్టం తారాస్థాయికి చేరింది. దక్షిణ సులవేసి, మకస్సార్‌ ప్రాంతంలో వర్షం ధాటికి ఓ డ్యాం ఉప్పొంగింది. వరద ప్రవాహానికి 8 మంది ప్రాణాలు కోల్పోగా..సుమారు 2 వేల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. చనిపోయినవారిలో ఇద్దరు చిన్నారులు ఉండగా..మరో వ్యక్తి వరదల సమయంలో కరెంట్‌ షాక్‌ తగిలి మృతి చెందాడు. నిరాశ్రయులైన బాధితులను సహాయక సిబ్బంది స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు, ప్రార్థనా స్థలాల్లోకి తరలించారని మకస్సార్‌ ప్రాంత ఉన్నతాధికారి అద్నాన్‌ ఇచ్సన్‌ తెలిపారు. వరదల్లో నలుగురు గల్లంతయ్యారని, వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నామన్నారు. సహాయక సిబ్బంది బోట్లలో వెళ్లి ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారని చెప్పారు.