ఇదే చివరి మన్‌కీ బాత్‌..మళ్లీ మేలో కులద్దాం

అమరవీరుల మోడీ నివాళి
న్యూఢిల్లీ,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): రానున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు తన చివరి మన్‌ కీ బాత్‌లో మోడీ  జాతినుద్దేశించి మాట్లాడారు. మళ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మేలో మరోసారి విూ ముందుకు వస్తా అని తన విజయంపై మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. మే చివరి ఆదివారం మళ్లీ మన్‌ కీ బాత్‌ ఉంటుందని ఆయన చెప్పారు.  2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రతి నెలా మన్‌ కీ బాత్‌ పేరుతో ఆల్‌ ఇండియా రేడియోలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్న విషయం తెలిసందే. అయితే తాను ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తాను. అందుకే ఇప్పటికి మన్‌ కీ బాత్‌ను ఆపేస్తున్నాను. మళ్లీ మే చివరి ఆదివారం విూ ముందుకు వస్తాను అని మోదీ అన్నారు. ఎన్నికల కారణంగానే తాను ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. తన చివరి మన్‌ కీ బాత్‌లో పుల్వామా అమర వీరులకు మోదీ నివాళులర్పించారు. ఈ దాడి తర్వాత భారతీయులంతా ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారని ఆయన అన్నారు. అమరవీరుల కుటుంబాలు దేశానికి ఓ స్ఫూర్తిగా నిలిచాయని కొనియాడారు. జాతీయ యుద్ధ స్మారకాన్ని సోమవారం ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. అందరూ ఈ స్మారకం దగ్గరకు రావాలని, అక్కడ ఫొటోలు దిగి సోషల్‌ విూడియాలో పోస్ట్‌ చేయడం ద్వారా ఇతరులను ప్రోత్సహించాలని చెప్పారు.  అమరవీరుల స్మృతి చిహ్నంగా దేశరాజధానిలో నేషనల్‌ వార్‌ మెమోరియల్‌ సిద్ధమైందన్నారు. పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన ఆయన.. అమరజవాన్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. శాంతిని కాపాడటంలో భారత సైనిక బలగాల సేవలు ప్రశంసనీయమన్నారు మోడీ. 53వ మన్‌ కీ బాత్‌ లో మాట్లాడిన ప్రధాని.. పుల్వామా  ఘటనతో దేశ ప్రజలంతా తల్లడిల్లిపోయారని, ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారన్నారు. అమరజవాన్లు, వారి కుటుంబాలకు సంతాపాలు, సంఘీభావాలు వెల్లువెత్తాయని అన్నారు. మన సాయుధ బలగాలు ఎప్పుడూ మొక్కవోని సాహసం ప్రదర్శిస్తున్నాయన్న మోడీ.. టెర్రరిస్టులకు వారి భాషలోనే
జవాబిస్తున్నాయని కొనియాడారు.