ఈ నెల 29 నుండి శ్రావణ మాసం ఉత్సవాలు

జహీరాబాద్ జులై   (జనంసాక్షి) ఈ నెల 29 నుండి శ్రావణ మాసం ఉత్సవాలను నిర్వహించనున్నట్లు కోహిర్ మండలం  బెడంపేట రాచన్న స్వామి ఆలయ ఈవో శివ రుద్రప్ప స్వామి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో కంటే ఈ సంవత్సరం భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని, అందుకు తగిన ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఆది, సోమ, అమావాస్య రోజులలో యజ్ఞ మంటపంలో మిగతా రోజులలో గర్భాలయంలో అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా గర్భ గుడిలో లింగ దర్శనం ఆది, సోమ, అమావాస్యలలో ఉండదన్నారు. పాత ధరల పద్ధతిలోనే పూజా కార్యక్రమాల రుసుం చెల్లించాల్సి ఉంటుందన్నారు. అమావాస్యకు ముందు చతుర్దశి రోజు భక్తులకు రాత్రి 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మంకీ పాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆలయానికి వచ్చే భక్తులు నియమ నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు వహించాలన్నారు.   భక్తులు తమకు ఏమైనా సమస్యలు ఉంటే ఆలయ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.  ఈ సమావేశంలో  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.