ఉగ్ర ముసుగు తొలగించుకోండి

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌కు ఓవైసీ హితవు
ముంబయి,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): పుల్వామా దాడికి మూలాలు పాకిస్థాన్‌లోనే ఉన్నాయని ఎంఐఎం అధినేత హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పాకిస్థాన్‌, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా పాక్‌ ప్రధాని అమాయకపు ముసుగు తొలగించాలన్నారు. కెమెరాల ముందు కూర్చొని భారత్‌కు నీతి వ్యాఖ్యాలు బోధించొద్దన్నారు. ఉగ్రవాదులను పక్కనే పెట్టుకుని అమాయకపు మాటలు మాట్లాడితే ప్రపంచం నమ్మదని అన్నారు. భారత్‌లో ముస్లింలు,హిందువుల కలసిమెలసి ఉన్నారని గుర్తుంచుకోవాలన్నారు. పుల్వామా  దాడి మొదటిది కాదు. ఇప్పటికే పఠాన్‌కోట్‌, ఉరీ ఘటనలు జరిగాయి. భారత్‌ తరఫున నేను పాక్‌ ప్రధానికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటికైనా అమాయకత్వపు ముసుగు తొలగించండని ఓవైసీ అన్నారు. భారత ముస్లింల గురించి పాక్‌ ఆలోచించొద్దన్నారు. 1947లోనే భారత్‌ను ఇక్కడి ముస్లింలు సొంత దేశంగా భావించారన్నారు. భారత దేవాలయాల్లో గంటలు మోగనివ్వం అని పాక్‌కు చెందిన ఓ ఎంపీ చేసిన వ్యాఖ్యలకు ఓవైసీ దీటైన సమాధానమిచ్చారు. విూకు భారత్‌కు గురించి తెలియదు. భారత్‌లో ముస్లింలు బతికున్నంత కాలం మసీదుల్లో ఆజాన్‌.. దేవాలయాల్లో గంటలు మోగుతూనే ఉంటాయి. ఇక్కడి ప్రజలు బతికున్నంత కాలం కలిసే ఉంటారు. దీన్ని పాక్‌ ఓర్వలేకపోతోందని ఓవైసీ అన్నారు. పాకిస్థాన్‌ ప్రభుత్వం, సైన్యం, ఐఎస్‌ఐ కలిసే పుల్వామా దాడిని జరిపాయన్నారు. ఓ మహ్మద్‌.. వ్యక్తి ప్రాణాల్ని బలితీసు కోడన్నారు. జై షే మహమ్మద్‌ సంస్థను జై షే సైతాన్‌గా ఆయన అభివర్ణించారు. అలాగే దాడికి ఇంటెలిజెన్స్‌ లోపం కూడా ఓ కారణమన్నారు. అయితే పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని భారత్‌ సహించదన్నారు.