ఉద్యమకారులకు మళ్లీ బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానం

` ఎట్టికైనా, మట్టికైనా మనోడే కావాలి
` తెలంగాణ ఆకాంక్షను అణిచివేసింది కాంగ్రెస్సే
` వారిని నమ్మితే ఇక అంతే
` రైతుబంధు, దళితబంధు కలలోనైనా ఊహించామా
` మంత్రి కెటిఆర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ ప్రజల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉండే ఆర్తి రాహుల్‌కో, మోదీకో ఉండదు.. ఎట్టికైనా, మట్టికైనా మనోడే కావాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో జిట్టా బాలకృష్ణారెడ్డి, మామిళ్ల రాజేందర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ప్రసంగించారు. నల్లగొండ జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలిచేది పైళ్ల శేఖర్‌ రెడ్డి అని కేటీఆర్‌ తెలిపారు. సొంతింటికి తిరిగి వచ్చిన జిట్టా బాలకృష్ణారెడ్డికి శుభాకాంక్షలు. దారి తప్పిన కొడుకు ఇంటికి తిరిగొచ్చినట్టుంది. ఈనగాసి నక్కలపాలు చేయొద్దని కలిసి వస్తున్నారు. రూ. 50 లక్షలతో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్‌ రెడ్డి. సోనియా గాంధీని బలి దేవత అన్నది రేవంత్‌ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. ఉద్యమంలో బిడ్డలు అమరులు కావడానికి కాంగ్రెస్‌ కారణం. సోనియమ్మ దయతలచి తెలంగాణ ఇచ్చిందని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. టీఆర్‌ఎస్‌ లేకుంటే టీ పీసీసీ, టీ బీజేపీ ఉండేవా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీ జాతీయ నేతలు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. తాము ఎవరికి ఏ టీం, బీ టీం కాదు.. తెలంగాణ ప్రజల టీం అని స్పష్టం చేశారు. రాహుల్‌ గాంధీని ముద్దపప్పు అన్నది రేవంత్‌ రెడ్డే. రేవంత్‌ అవసరానికి కండువా మార్చుకుంటే తామంతా మారాలా..? తెలంగాణ ఆకాంక్షలను మొదటి నుంచి అణిచివేసింది కాంగ్రెస్సే. బీసీ జన గణన చేయాలని అడిగితే మోదీ పెడచెవిన పెట్టారు. తెలంగాణ ప్రజల్ని గుజరాతీ విముక్తి చేస్తాడని మోదీ అన్నారు. తెలంగాణలో తాము ఏం చేయలేదని ఓడిస్తారు..? సాగు, తాగునీరు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి ఇస్తున్నామన్నారు. అన్నిరంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉన్నాం. అన్ని కులవృత్తుల వారిని అభివృద్ధి చేస్తున్నాం. తెలంగాణలో ప్రజలంతా అన్నదమ్ముల్లా కలిసి మెలిసి జీవిస్తున్నాం. ముదిరాజ్‌ బిడ్డలకు గౌరవం ఇచ్చింది సీఎం కేసీఆర్‌. కేసీఆర్‌ ఏకు మేకు అయితడని కాంగ్రెస్‌, బీజేపీకి భయం పట్టుకుంది. కాంగ్రెస్‌కు ఐదారుగురు ముఖ్యమంత్రులు దొరికినా, ఓటర్లు దొరకడం లేదు. మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి అయితడని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

(రావుల చంద్రశేఖర్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌  తీర్థం
` పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన కేటీఆర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): వనపర్తి జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకులు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో రావుల చంద్రశేఖర్‌ రెడ్డికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మంత్రి నిరంజన్‌ రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నాథంతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.రావుల చంద్రశేఖర్‌ రెడ్డి టీడీపీ తరపున 1994, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నియోకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో ఏపీ ప్రభుత్వ విప్‌గా పని చేశారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడి టీడీపీ ముఖ్య నాయకులు వివిధ పార్టీల తీర్థం పుచ్చుకున్నారు. రావుల మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు. చంద్రబాబు ఆయనను పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కూడా నియమించారు. వనపర్తి జిల్లాలో రావుల చంద్రశేఖర్‌ రెడ్డికి మంచి పట్టుంది.