ఉప్పుడు బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం ` కీలక నిర్ణయం..


దిల్లీ(జనంసాక్షి): ఉప్పుడు బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా వీటి ధరలను అదుపులో ఉంచడంతో పాటు, నిల్వలను సరిపడా అందుబాటులో ఉంచడం కోసం ఎగుమతులపై 20 శాతం సుంకం విధించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఆగస్టు 25 నుంచే ఈ సుంకం అమల్లోకి రాగా.. ఈ ఏడాది అక్టోబరు 16 వరకు ఈ నిబంధన కొనసాగుతుందని పేర్కొంది. అయితే, ఎల్‌ఈవో జారీ కానప్పటికీ ఇప్పటికే కస్టమ్స్‌ పోర్టుల్లో లోడ్‌ చేసి ఉంచిన పార్‌బాయిల్డ్‌ రైస్‌కు ఈ సుంకం వర్తించదని ఆర్థికశాఖ వెల్లడిరచింది. దీంతో పాటు సరైన లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఉన్న ఎగుమతులకు కూడా సుంకం నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు తెలిపింది.ఇటీవల బాస్మతీయేతర బియ్యంఎగుమతులపై కేంద్రం నిషేధం అమలు చేయడంతో.. ఉప్పుడు బియ్యానికి డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా వీటి ధరలు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశీయంగా ఉప్పుడు బియ్యం నిల్వలను తగినంతగా అందుబాటులో ఉంచడంతో పాటు, రిటైల్‌ ధరలను నియంత్రించేందుకు కేంద్రం ఈ సుంకం విధించింది.మన దేశ బియ్యం ఎగుమతుల్లో బాస్మతియేతర తెల్ల బియ్యం వాటా 25శాతంగా ఉంటోంది. అయితే, దేశీయంగా బియ్యం ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో గత నెల బాస్మతియేతర రకాల ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. పాక్షికంగా మరపట్టిన, పూర్తిగా మరపట్టిన, పాలిష్‌ చేయని తెల్ల బియ్యం ఎగుమతులపై ఈ నిషేధం వర్తిస్తుంది. అంతకుముందు నూకలపైనా నిషేధం విధించారు. ఇప్పుడు ఉప్పుడు బియ్యం ఎగుమతులపైనా సుంకం అమలు చేయడంతో.. అన్నిరకాల నాన్‌ బాస్మతీ రైస్‌ ఎగుమతులపై ఆంక్షలు విధించినట్లయింది.దేశీయ రిటైల్‌ మార్కెట్లో ఏడాది వ్యవధిలో బియ్యం ధరలు 11.5 శాతం మేర పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌`జూన్‌ మధ్య 15.54 లక్షల టన్నుల బాస్మతీయేతర బియ్యం మన దేశం నుంచి ఎగుమతైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఈ ఎగుమతులు 11.55 లక్షల టన్నులుగా ఉన్నాయి. ఎగుమతులు విపరీతంగా పెరగడం, దాని కారణంగా నిల్వలు తగ్గి దేశీయంగా ధరలు పెరగడంతో.. ఈ బియ్యం రకాలపై కేంద్రం నిషేధం విధించింది.