ఉలిక్కిపడ్డ దేశ రాజధాని

–  కరోల్‌బాగ్‌ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం
– 17మంది మృతి, మరికొందరికి తీవ్ర గాయాలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి12(జ‌నంసాక్షి) : దేశ రాజధాని ఢిల్లీలోని కరోల్‌బాగ్‌ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. అత్యంత రద్దీగా ఉండే కరోల్‌బాగ్‌ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్యకు 17కు చేరుకుంది. అర్పిత్‌ ప్యాలెస్‌ ¬టల్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో మరి కొందరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. భవనంలో నుంచి దాదాపు 50 మందిని సహాయక
సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. వీరిలో కొందరు గాయపడగా, 35 మందిని సురక్షితంగా బయటపడ్డారు. బాధితులు గాఢ నిద్రలో ఉన్న సమయంలోనే ప్రమాదం చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్య భారీగా ఉందని పోలీసులు తెలిపారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో హీటర్లు వేసుకుని నిద్రపోయారని, ఓ రూమ్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ జరగడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు, మంటలు వ్యాపించగానే కొందరు భవనం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. కొందరు టెర్రస్‌ పైనుంచి, భవనం కిటికీల నుంచి కిందకు దూకి ప్రాణాలను రక్షించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ మహిళ, చిన్నారి మృతిచెందగా, మిగతావారు మంటల్లో చిక్కుకుని ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రికి తరలించారు. ఆపరేషన్‌లో మొత్తం 26 ఫైరింజన్లను వినియోగించి మంటలను అదుపు చేశారు. పైఅంతస్తులో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో కొంత మేర ప్రాణ నష్టం తగ్గింది. అందులోకి ప్రవేశించడానికి అగ్నిమాపక సిబ్బంది చాలా కష్టపడాల్సి వచ్చింది. కిటికీల అద్దాలు పగలగొట్టి వారు లోపలికి ప్రవేశించారు.