ఉస్మానియాలో కోవిడ్‌తో వ్యక్తి మృతి!

` పరీక్షల్లో గుర్తించిన వైద్యులు
` అతడి మరణానికి కరోనా కారణం కాదు..
` క్లారిటీ ఇచ్చిన ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌
హైదరాబాద్‌,డిసెంబర్‌26(జనంసాక్షి):దాదాపు మూడేళ్లు ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన కరోనా వైరస్‌ మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తుంది. భారత్‌తోపాటు తెలంగాణలోనూ  మళ్లీ కోవిడ్‌ కలవరం రేపుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 412 మంది కోవిడ్‌ బారిన పడగా.. ముగ్గురు మరణించారు. ప్రస్తుతం 4,170 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా తెలంగాణలో ఈ ఏడాది తొలి కరోనా మరణం సంభవించింది. ఉస్మానియా ఆసుపత్రిలో కోవిడ్‌తో ఇద్దరురోగులు ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరు జూనియర్‌ డాక్టర్‌లకు సైతం పాజిటివ్‌గా తేలింది. అనారోగ్య సంబంధిత వ్యాధిలతో ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలో చేరగా.. సమస్య తీవ్రం కావడంతో ఇద్దరురోగులు మరణించారు.. మృతులకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా వైద్యులు నిర్దారించారు. మృతులను 60 ఏళ్ల వ్యక్తితోపాటు 40 ఏళ్ల వ్యక్తిగా తెలిపారు. తెలంగాణలోనూ కోవిడ్‌ వ్యాప్తి పెరుగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 12 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 55 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే అత్యధికంగా 45 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఎర్రగడ్డ చెస్ట్‌ ఆసుపత్రిలో 54 పాజిటివ్‌ చేసులు నమోదయ్యాయి.  ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారులు కోవిడ్‌ టెస్ట్‌లు పెంచారు,
అతడి మరణానికి కరోనా కారణం కాదు..
ఆసుపత్రి సూపరింటెండెంట్‌ క్లారిటీ
కొత్తగా వెలుగు చూసిన కొవిడ్‌ జేఎన్‌.1 వేరియంట్‌తో తేలికపాటి లక్షణాలుంటాయని.. వైరస్‌తో భయపడాల్సిన అవసరం లేదని ఉస్మానియా జనరల్‌ ఆసుప్రతి సూపరింటెండెంట్‌ నాగేందర్‌ అన్నారు. ఆసుపత్రిలో కొవిడ్‌తో ఓ వ్యక్తి చనిపోయారని వస్తున్న వార్తలో ఏమాత్రం నిజం లేదన్నారు. నగర పరిధిలోని బండ్లగూడ దూద్‌బౌలికి చెందిన ఎండీ సుభాన్‌ (60) తీవ్రమైన ఎడమ జఠరిక పని చేయకపోవడం (గుండె ఆగిపోవడం), టైప్‌`2 శ్వాసకోశ వైఫల్యంతో ఆసుపత్రి అక్యూట్‌ మెడికల్‌ కేర్‌లో చేరారన్నారు.ఆ యాదృచ్ఛికంగా జరిగిన పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చింది.. మరణానికి కొవిడ్‌ కారణం కాదన్నారు. ప్రస్తుతం ముగ్గురు రోగులు ఐసోలేషన్‌ వార్డులో వివిధ అత్యవసర పరిస్థితుల్లో అడ్మిట్‌ అయ్యారని, వారికి కొవిడ్‌ సోకినట్లుగా గుర్తించారన్నారు. ముగ్గురు రోగుల ఆరోగ్యం నిలకడగా ఉందని, రోగులను ఇతర వైద్య అత్యవసర పరిస్థితులతో అడ్మిట్‌ చేయాలని, యాదృచ్ఛికంగా కొవిడ్‌కు పాజిటివ్‌గా తేలినందున ఒంటరిగా ఉంచి, అవసరమైన అన్ని చికిత్సలు అందించాలన్నారు.