ఎన్నికలకు ముందు దాడులు జరుగుతాయని తెలుసు

వైమానిక దాడులపై ఫరూక్‌ అబ్దుల్లా వ్యాఖ్యలు
కాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు నిర్వహించరని ప్రశ్న
శ్రీనగర్‌,మార్చి11(జ‌నంసాక్షి):  పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళాలు పాకిస్తాన్‌లోని జైషే మహ్మద్‌ ఉగ్రస్థావరాలపై జరిపిన మెరుపు దాడులపై జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ ఫరూక్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందనీ… అందుకే రాజకీయ ప్రయోజనాల కోసం వైమానిక దాడులు నిర్వహించారని ఆయన ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ఫరూక్‌ ఇవాళ విూడియాతో మాట్లాడుతూ..’పాకిస్తాన్‌పై యుద్ధం లేదా ఘర్షణ ఏదో ఒకటి జరుగుతుందని మాకు ముందే తెలుసు. ఈ సర్జికల్‌ దాడులు ఎన్నికల దగ్గరపడుతున్నాయి కాబట్టే చేశారు. ఈ సందర్భంగా కోట్ల రూపాయల విలువైన ఓ యుద్ధ విమానాన్ని పోగొట్టుకున్నాం. దేవుడి దయవల్ల ఐఏఎఫ్‌ పైలట్‌ సజీవంగా బయటపడి, పాకిస్తాన్‌ నుంచి సురక్షితంగా వచ్చాడు.. అని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని ఫరూక్‌ అబ్దుల్లా ప్రశ్నించారు. రాజకీయ పక్షాలన్నీ లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు సుముఖంగా ఉన్నప్పటికీ.. కేవలం లోక్‌సభ ఎన్నికలను మాత్రమే నిర్వహించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. జమ్మూ కశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలకు వాతావరణం బాగుంది కానీ.. అసెంబ్లీ ఎన్నికలకు అనుకూలంగా లేదా? స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరగాయి కదా? ప్రస్తుతం ఇక్కడ సరిపడా భద్రతా దళాలు కూడా ఉన్నాయి. అయినా రాష్ట్ర ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు? అని ఆయన ప్రశ్నించారు.