ఎన్నికలు రావొచ్చు సిద్ధం కండి

సడక్‌ దిగ్బంధంలో పాల్గొందాం
తెరాస కార్యవర్గ సమావేశంలో కేసీఆర్‌
హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (జనంసాక్షి) :
ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని, పార్టీ శ్రేణులు ఇందుకు సిద్ధంగా ఉండాలని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కోరారు. స్థానిక తెలంగాణ భవన్‌లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమేనని, ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామన్నారు. పల్లెబాటను మార్చి 21 వరకు పొడగించాలని, ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికలు అందజేయాలని ఆయా జిల్లాల నేతలకు సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల పర్యవేక్షణకు జిల్లాకో సీనియర్‌ నేతను నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 24న నిర్వహించనున్న బెంగళూరు రహదారి దిగ్బంధంలో పాల్గొని విజయవంతం చేద్దామని ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాగా, విజయవాడలో మార్చి 2న నిర్వహించనున్న విజయవాడ రహదారి దిగ్బందాన్ని వాయిదా వేసేందుకు జేఏసీ నేతలతో చర్చించినట్లు తెలిసింది.