ఎస్‌ బ్యాంక్‌ సిఇవోగా రవ్‌నీత్‌ గిల్‌

అనూహ్యంగా పెరిగిన బ్యాంక్‌ షేర్‌ ధరలు

న్యూఢిల్లీ,జనవరి24(జ‌నంసాక్షి): ప్రయివేటు రంగ యస్‌ బ్యాంక్‌ నూతన ఎండీ, సీఈవోగా రవ్‌నీత్‌ గిల్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీఈవో రాణా కపూర్‌ పదవీకాలం ఈ నెల 31తో ముగియనుంది. దీంతో కొత్త సీఈవోగా రవ్‌నీత్‌ బాధ్యతలు చేపట్టనున్నట్లు యస్‌ బ్యాంక్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. రవ్‌నీత్‌ నియామకాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా ఆమోదించినట్లు బ్యాంకు ఆ ప్రకటనలో పేర్కొంది. కాగా.. రవ్‌నీత్‌ నియామకం నేపథ్యంలో స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో బ్యాంకు షేర్లు అనూహ్యంగా పెరిగాయి. ఒక దశలో షేరు ధర 20శాతం వరకు పెరిగింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకు షేరు ధర 14.32శాతం పెరిగి రూ. 225.50 వద్ద కొనసాగుతోంది. ఇకపోతే 2019 మార్చి 1లోగా రవ్‌నీత్‌ ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం రవ్‌నీత్‌ డుచె బ్యాంక్‌ ఇండియా సీఈవోగా పనిచేస్తున్నారు. యస్‌ బ్యాంక్‌ సీఈవో వ్యవహారం ఇటీవల వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. బ్యాంకు సీఈవోగా ఉన్న రాణా కపూర్‌ పదవీకాలం గతేడాది ఆగస్టు 31తో ముగిసింది. అయితే సీఈవోగా రాణాను పునర్నియమిస్తూ బ్యాంకు బోర్డు నిర్ణయం తీసుకుంది. మరో మూడేళ్ల పాటు రాణా ఈ పదవిలో కొనసాగుతారని గతంలో ప్రకటించింది. అయితే యస్‌ బ్యాంక్‌ ఆర్‌బీఐ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో మరోసారి రాణాను ఎండీ, సీఈవోగా కొనసాగించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ నిరాకరించింది. వచ్చే ఏడాది జనవరి చివరి వరకు మాత్రమే ఆయన సీఎండీగా కొనసాగుతారని, ఆ లోగా కొత్త సీఈవో, ఎండీని ఎంపికచేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది. ఈ నేపథ్యంలో రవ్‌నీత్‌ను నియమిస్తూ యస్‌బ్యాంక్‌ నేడు ప్రకటన విడుదల చేసింది.