ఏపీకి ఏమిచ్చారో చెప్పాకే.. రాష్ట్రానికి మోడీరావాలి
– కర్నూలు అసెంబ్లీ టికెట్ నా కుమారుడు ఆశిస్తున్నాడు
– గెలిచేవారికే బాబు టికెట్ ఇస్తారు
– తెదేపా ఎంపీ టీజీ వెంకటేష్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి7(జనంసాక్షి) : ఏపీకి ఏమిచ్చారో చెప్పాకే ప్రధాని మోదీ రాష్ట్రానికి రావాలని టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.. కర్నూలు స్థానాన్ని కేఈ కుటుంబం కోరుతున్నట్లు తెలిసిందని చెప్పారు. ‘నా కుమారుడు భరత్ కూడా కర్నూలు సీటే ఆశిస్తున్నాడని టీజీ తెలిపారు. గెలిచేవారికే చంద్రబాబు టికెట్ ఇస్తారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోట్ల, కేఈ కుటుంబాలు కలిసి పనిచేయాలని సూచించారు. తన కుమారుడు భరత్ కర్నూలులో కచ్చితంగా గెలుస్తాడని, అతనికే అధిష్టానం టికెట్ కేటాయిస్తుందని చెప్పుకొచ్చారు. టీడీపీ గెలిచే వారికే సీట్లు ఇస్తుందని, గెలవడు అనుకుంటే తన కొడుకుకి సైతం టికెట్ ఇవ్వదని టీజీ వెంకటేష్ అన్నారు. ‘కేఈ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని కలిశారని, వారు కూడా కర్నూలు సీటును ఆశిస్తున్నట్లు వార్తల్లో చదివానన్నారు. కర్నూలు నుంచి గెలిచే అవకాశాలు భరత్కే ఎక్కువగా ఉన్నాయన్నారు. అతనికే సీటు వస్తుందని అనుకుంటున్నానని, మిగిలిన వారు ఎవరూ తమకు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పలేరన్నారు. అయితే ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం మేరకే నడచుకుంటానని టీజీ అన్నారు. కేఈ కృష్ణమూర్తి, కోట్ల కుటుంబాల మధ్య కొన్ని తరాలగా అంతర్గత విభేదాలు ఉన్నాయని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. నాటి పరిస్థితుల దృష్ట్యా తొలుత బీజేపీతో చంద్రబాబు నాయుడు జత కట్టారని, కానీ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే విడిపోయారని టీజీ పేర్కొన్నారు. కేంద్రంతో ఎప్పుడు పోరాడాలో చంద్రబాబుకు తెలుసన్నారు. వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వకుండా వేరే రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నారని టీజీ వెంకటేష్ మండిపడ్డారు. ఏ రాష్ట్రానికి ప్రత్యేక ¬దా ఇవ్వడం లేదని కేంద్రం చెప్పింది కానీ కొన్ని రాష్ట్రాలకు ¬దాను అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రధానమంత్రి ఏపీకి వస్తానని అంటున్నారని… వచ్చే ముందు రాష్ట్రానికి ఎం ఇచ్చారో చెప్పి రావాలని ఆయన డిమండ్ చేశారు.