కనీస వేతనం బిక్ష కాదు కార్మికుని హక్కు,

జహీరాబాద్ జులై 26 (జనంసాక్షి)కనీస వేతనం బిక్ష కాదు కార్మికుని హక్కు, కనీస వేతనం 26000/- ఇవ్వాలి 3 షెడ్యూల్డ్ పరిశ్రమల కనీస వేతనాలు జీవోలను సవరించాలి అని సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.మహిపాల్ అన్నారు. మంగళవారం జహీరాబాద్ ఏ ఎల్ ఓ  ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు పెరగకపోవడం వల్ల చాలీ చాలని జీతాలతో జీవిస్తున్నారని తెలిపారు.  పారిశ్రామిక ప్రాంతంలో నూటికి 90 శాతం మంది కార్మికులు కాంట్రాక్టు కార్మికులే ఉన్నారన్నారు.  పర్మినెంట్‌ కార్మికులు చేసే పనుల్లో సైతం కాంట్రాక్టు కార్మికుల్ని వినియోగిస్తున్నారు. కాని వీరికి ఎలాంటి చట్టబద్ద సౌకర్యాలు అమలు చేయడం లేదని అన్నారు.  జీవితాంతం బానిసల్లా కాంట్రాక్టు కార్మికులుగానే కొనసాగుతున్నారు. వీరిని పర్మినెంట్‌ కార్మికులుగా గుర్తించడం లేదు. ప్రభుత్వం కనీస వేతనాల జీవోలను సకాలంలో సవరించకపోవడం వల్ల గత పది సంవత్సరాలుగా వివిధ రంగాల కార్మికుల జీతభత్యాలు పెరగలేదని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత జీతాలు పెరుగుతాయి. కొత్త జీవోలు వస్తాయని ఎదురు చూసిన కార్మికులకు నిరాశే ఎదురైందన్నారు.  పాలకులు వేరైనా, ప్రాంతాలు వేరైనా బతుకులు మారలేదనే ఆవేదనతో కార్మికులు ఉన్నారని,  కార్మికుల జీతాలు పెంచకపోవడానికి పారిశ్రామికవేత్తల ఒత్తిడే కారణమన్నారు. లక్షలాది మందిగా ఉన్న కార్మికులకు జీవోలు సవరించి వేతనాలు పెంచితే ప్రభుత్వంపై నయా పైసాభారం పడదని తెలిపారు.  కాంట్రాక్ట్ కార్మికులకు భద్రత లేకుండా పోయ్యిందని, కనీస వేతనం, పీఎఫ్‌., ఇ.ఎస్‌.ఐ., సెలవులు, అపాయింట్‌మెంట్‌ లెటర్స్‌, సమాన పనికి సమాన వేతనం రాష్ట్రంలో ఎక్కడా అమలు కావడం లేదని అన్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవత్వం మరిచి ముక్కుమడిగా కార్మిక వర్గంపై దాడి చేస్తున్నాయని తెలిపారు. కార్మికుల హక్కుల రక్షణ కోసం సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వివిధ పరిశ్రమల, రంగాల సిఐటియూ నాయకులు కనకారెడ్డి, యల్లప్ప, వీరయ్య గౌడ్, శ్రీనివాస్, శ్రీకాంత్, నరేష్,B.సుధాకర్, ఎలిశా, తదితరులు పాల్గొన్నారు.