కరోనా వ్యాక్సిన్‌ వైద్యశాస్త్ర వైఫల్యం

బూస్టర్‌ డోస్‌ వేసుకున్నా కూడా బైడెన్‌కు కరోనా
యోగాగురు బాబా రాందేవ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

హరిద్వార్‌,ఆగస్ట్‌4(జనం సాక్షి ): ప్రముఖ యోగాగురు బాబా రాందేవ్‌ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్‌ను వైద్య శాస్త్ర వైఫల్యంగా అభివర్ణించారు. కొవిడ్‌ బూస్టర్‌ డోసు వేసుకున్నా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. కరోనా బారినపడ్డారని అన్నారు. ప్రపంచం మొత్తం మూలికా వైద్యం వైపు చూస్తోందని చెప్పుకొచ్చారు. ఉత్తరాఖండ్‌.. హరిద్వార్‌లో పతంజలి ఆధ్వర్యంలో జరుగుతున్న
కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పై వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కొవిడ్‌ బూస్టర్‌ డోసు వేసుకుంటే అది కాస్త మళ్లీ.. ’కరోనా’ వచ్చేందుకు కారణమైందని విమర్శించారు. అమెరికాను టార్గగెట్‌ చేస్తూ.. ’మేమే ప్రపంచానికి చక్రవర్తులం. మా కంటే గొప్పవారెవరూ లేరు అనుకోవడం తప్పు. ఇకపై ప్రపంచం మొత్తం మూలికా వైద్యం వైపు చూస్తుంది’ అని బాబా రాందేవ్‌ అన్నారు. కోట్లాది మంది ప్రజలు తమ ఇంటి వెలుపల తులసి, కలబంద, తిప్ప మొక్కలను పెంచుతున్నారని అన్నారు. ఈ చెట్లు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయని తెలిపారు. అలాగే తిప్ప చెట్టుపై పరిశోధనలు చేసి.. మందులు తయారు చేస్తే భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందని బాబా రాందేవ్‌ అభిప్రాయపడ్డారు. అంతకుముందు కూడా బాబా రాందేవ్‌ పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొవిడ్‌ చికిత్సలో ఉపయోగిస్తున్న అలోపతి ఔషధాల సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ మందుల కారణంగా లక్షలాది మంది చనిపోయారని వ్యాఖ్యానించారు. తీవ్ర విమర్శలు వ్యక్తమైనందున ఆ వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.