కర్తర్పూర్ కారిడార్ విషయంలో.. పాక్ నుండి ఎలాంటి ప్రతిపాదన రాలేదు
– సిద్ధూ వ్యాఖ్యలను ఖండించిన కేంద్ర మంత్రి వీకే సింగ్
– సానుకూల వాతావరణం ఉంటే శాంతిచర్చలకు భారత్ సిద్ధం
– స్పష్టం చేసిన వీకే సింగ్
న్యూఢిల్లీ, సెప్టెంబర్17(జనంసాక్షి) : ఇరుదేశాల మధ్య ఉన్న కర్తర్పూర్ కారిడార్ను ప్రారంభించడానికి పాకిస్థాన్ నుంచి భారత్కు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని కేంద్ర మంత్రి, మాజీ సైన్యాధిపతి వీకే సింగ్ తెలిపారు. ఇటీవల పాకిస్థాన్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఆయన ఆహ్వానం మేరకు ఆ దేశం వెళ్లిన పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ పాక్ సైన్యాధిపతి జనరల్ ఖమర్ జావెద్ బజ్వాను ఆలింగనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన సిద్ధూ..
గురునానక్ 550వ జయంతి సందర్భంగా పాక్ కర్తర్పూర్ మార్గాన్ని ప్రారంభిస్తుందని, ఆ విషయం తెలుపుతూ ఆయన తనను ఆలింగనం చేసుకున్నాడని వ్యాఖ్యానించారు. కాగా సోమవారం వీకే సింగ్ మాట్లాడారు.. సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదన రాలేదన్నారు. ఆ సమస్య చాలా కాలం నుంచి ఉందని అన్నారు. ఒకవేళ దీనిపై ఎటువంటి ప్రతిపాదనలు వచ్చినా స్వయంగా మేమే విూడియాకు తెలియజేస్తామని అన్నారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురించి స్పందించిన వీకే సింగ్ పాక్ కొత్త ప్రధానికి ఆర్మీ సాయం అందిస్తోందని, రాజకీయపరంగా ఎటువంటి మార్పు వచ్చే అవకాశం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. పాక్ ఆర్మీ ఇప్పుడు కూడా కాల్పులు జరుపుతూనే ఉందని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య శాంతి కోసం చర్చలు జరిపే విషయంపై ఆయనను ప్రశ్నించగా.. ఈ విషయంపై భారత వైఖరి స్పష్టంగా ఉందన్నారు. సానుకూల వాతావరణం ఉంటేనే చర్చలు జరుగుతాయని అన్నారు. కాగా, పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనే అవకాశం ఉందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. భారత్, పాక్ మధ్య చర్చలు జరగాలని ఇమ్రాన్ కూడా వ్యాఖ్యానించారు. అయితే, ఓ వైపు పాక్ కాల్పులు జరుపుతూనే మరోవైపు చర్చలు జరిపితే లాభం లేదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.