కాంగ్రెస్‌కు శస్త్రచికిత్స జరగాల్సిందే దిగ్విజయ్‌ సింగ్‌


దిల్లీ: రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చేదు అనుభవం ఎదురుకావడంపై ఆ పార్టీ సీనియర్‌ నేత, ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ దిగ్విజయ్‌ సింగ్‌ స్పందించారు. ఇక ఆత్మపరిశీలన చేసుకునేదేమీ లేదని పార్టీకి శస్త్రచికిత్స జరగాల్సిన అవసరం ఉందన్నారు. అస్సాం, కేరళల్లో కాంగ్రెస్‌ అధికారం కోల్పోయిన నేపథ్యంలో కారణాల్ని మరోసారి పరిశీలిస్తామని చెప్పారు.

ఫలితాలు నిరాశపరిచాయని అయితే ఈ అపజయం వూహించనిది కాదన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 543 సీట్లకుగాను కాంగ్రెస్‌కు కేవలం 44 సీట్లు మాత్రమే వచ్చాయన్నారు. అంతటి పేలవ ప్రదర్శన తర్వాత కూడా పార్టీలో ఎలాంటి కీలక మార్పులూ జరగలేదని ఆయన చెప్పారు. ఏఐసీసీలో భారీగా మార్పులు జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. తర్వాత పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ అవ్వాలన్న అర్థంలోనూ ఆయన మాట్లాడారు. పార్టీ ఇంకా ఎంత కాలం ఆత్మపరిశీలన చేసుకోవాలో ఆలోచించుకోవాలని నష్టనివారణ చర్యలు చేపట్టాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిపారు.