మోడీని చుట్టుముడుతున్న రాఫెల్‌ డీల్‌

కాంగ్రెస్‌పై విమర్శలతో తప్పించుకునే యత్నం

రాఫెల్‌ వెన్నాడుతున్నా మేకపోతు గాంభీర్యం

కాంగ్రెస్‌కు కలసి వస్తున్న రాఫెల్‌ అస్త్రం

న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): బోఫోర్స్‌ కుంభకోణంలో రాజీవ్‌ విలవిల్లాడినట్లుగానే ఇప్పుడు రాఫెల్‌ డీల్‌లో మోడీ కూడా ఇరుక్కోక తప్పడం లేదు. రాఫెల్‌పై రాహుల్‌ చేస్తున్న ఆరోపణలు తొలినాళ్లలో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అదంతా కావాలని చేస్తున్న ఆరోపణలగా కొట్టి పారేశారు. ఈ ఆరోపణలపై ప్రధాని మోడీ ఏనాడూ నేరుగా స్పందించలేదు. దీంతో ఇప్పుడు మోడీపై అనుమానాలు వస్తున్నాయి. కాంగ్రెస్‌ను ఎండగడుతూ ఇంకా దాన్ని బూచిగా చూపి లబ్దిపొందే యత్నంలో బిజెపి ఉంది. కానీ ఇప్పుడు రాఫెల్‌ దుమారం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత ఈ నాలుగేళ్లు పాలన ఎలా ఉన్నా అవినీతి రహితంగా సాగుతుందన్న పేరు వచ్చినా, వరుస ఘటనల నేపథ్యంలో మోడీ తీరుపైనా భ్రమలు తొలిగాయి. తాజాగా రాఫెల్‌ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తున్నా పట్టించుకోని వైనం కారణంగా మోడీపై అనుమానాలు పెరిగాయి. అలాగే అమిత్‌షా కుమారుడి వ్యాపారాలపైనా ఆరోపణలు వచ్చాయి. గత కాంగ్రెస్‌ పాలనతో పోల్చుకుంటే అవినీతిరహితంగా మోడీ పాలన సాగిందని ప్రజలంతా భావిస్తున్న తరుణంలో వరుస ఘటనలు మోడీపై వేలెత్తి చూపేలా ముసురుకున్నాయి. అందుకే రాఫెల్‌ వియంలో కాంగ్రెస్‌ ఇప్పుడు ఎదురుదాడికి దిగుతుంటే బిజెపి సమాధానం చెప్పుకోలేకపోతోంది. ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ అదేపనిగా రాఫెల్‌ను ప్రయోగిస్తున్నారు. రాఫెల్‌ విమానాల తయారీ కాంట్రాక్టు యూపీఏ సర్కారు హెచ్‌ఏఎల్‌కు ఇచ్చింది. రాఫెల్‌ విమానాలు దేశంలోనే తయారైతే లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవి. ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ చదివిన వేలాది మంది యువత డిజైన్లు రూపొందించేది. కానీ మోదీ ప్రభుత్వం రూ.58 వేల కోట్లతో 126 రాఫెల్‌ విమానాలు కొనుగోలు చేసే ఈ ఒప్పందాన్ని అనిల్‌ అంబానీ కంపెనీకి ఇచ్చి దేశ యువత ఉద్యోగాలు లాక్కొందన్న ఆరోపణలను రాహుల్‌ బలంగా ప్రచారం చేశారు. దేశంలో గత 70 ఏళ్లుగా సుఖోయ్‌, మిగ్‌, జాగ్వార్‌ లాంటి విమానాలు హెచ్‌ఏఎల్‌ తయారు చేస్తోంది. రాఫెల్‌ విమానాల ధర గురించి ప్రజలకు చెప్పబోమని రక్షణ మంత్రి అంటారు. ఫ్రాన్స్‌తో రహస్య ఒప్పందమని చెబుతారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇక్కడికి వచ్చినపుడు ఇదే విషయం అడిగితే ఎవరికైనా చెప్పవచ్చన్నారు. ఇప్పుడీ విషయాలను రాహుల్‌ పదేపదే వల్లె వేస్తున్నారు. దీనికి సరైన సమాధానం ఇచ్చుకోవాల్సిన ప్రధాని మోడీ కాంగ్రెస్‌పై ఎదురుదాడితో సరిపెడుతున్నారు. అయితే అవినీతి లేకున్నా అక్రమ రాజకీయాలు సాగుతూనే ఉన్నాయి. ఈ నాలుగేళ్లూ అవినీతి మరక అంటకుండా మోదీ దేశాన్ని పాలించారన్న భావన ప్రజల నుంచి చెరిగిపోతోంది. తనవైపు వేలెత్తి చూపే

అవకాశం లేకుండా మోదీ జాగ్రత్తగా వ్యవహరించినా రాఫెల్‌ డీల్‌ తరవాత ఇప్పుడు అన్ని వ్యవహారాలైనా అనుమానాలు వస్తున్నాయి. తన వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునేలా చేస్తున్న మోడీ ,పాలనలో మాత్రం అంతగా దూసుకుని పోవడం లేదు. ప్రధానంగా నోట్లరద్దు, జిఎస్టీతో ప్రజలకున్న ఆశలు అడియాశ లయ్యాయి. వరుస పరిణామాల వల్ల ప్రధాని మోదీ నైతికత, నిబద్ధత ప్రశ్నార్థకంగా మారాయి. కాంగ్రెస్‌ విముక్త భారత్‌ లక్ష్యంగా చేస్తున్న రాజకీయాలు ఒక్కోసారి వెగటుగా ఉంటాయనడానికి ఇటీవలి పరిణామాలు ఉదాహరణగా చెప్పుకోవాలి. కాంగ్రెస్‌ పార్టీని దెబ్బతీసే క్రమంలో చేస్తున్న పనులన్నీ దేశహితం కోసమేనని సరిపెట్టుకోలేం. అలాగే గతంలో విూరు చేయలేదా అని ఎదురుదాడి చేయడం ఇటీవల అలవాటు చేసుకుని కాంగ్రెస్‌ను విమర్శిస్తూ బిజెపికి ఉన్న ఇమేజ్‌ను చెడగొట్టారు. భారతీయ జనతా పార్టీ విస్తరణ కాంక్ష మోదీ, షాలను నిలవనివ్వడం లేదు. ఈ క్రమంలోనే తప్పటడుగులు వేస్తున్నారు. దేశమంతటా అన్ని రాష్ట్రాలలో భారతీయ జనతాపార్టీ పతాకం రెపరెపలాడాలన్నది ఈ ఇరువురి నాయకుల కోరిక కారణంగానే ఇప్పుడు దక్షిణాదిపై దృష్టిపెట్టారు. తమిళనాడులో పళనిస్వామి ప్రభుత్వాన్ని బుట్టలో వేసుకున్నారు. ఇంటెలిజెన్స్‌ బ్యూరో వంటి సంస్థలను ప్రయోగించి నానా ఇబ్బందులు పెడుతున్నారన్న ఆరోపణలు పెరిగాయి. సీబీఐ వ్యవహారాలు దేశప్రతిష్టను దెబ్బతీసాయి. ప్రభుత్వ ఏజెన్సీలను దుర్వినియోగం చేయడంలో కాంగ్రెస్‌ కన్నా విూడీ చురుకుగా ఉన్నారు.