కాంగ్రెస్ నా ఆఫర్ తిరస్కరించింది!
– ఒంటరిగానే పోటీకి సిద్ధమవుతున్నాం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి25(జనంసాక్షి) : కాంగ్రెస్ పార్టీ తాము ఇచ్చిన ఆఫర్ను తిరస్కరించిందని, వచ్చే ఎన్నికల్లో దేశ రాజధానిలో తాము ఒంటరిగా పోటీ చేస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. కూటమి కడదామన్న తన ఆఫర్ను కాంగ్రెస్ తిరస్కరించిందని ఆయన చెప్పారు. వాళ్లు కూటమికి నో చెప్పారని, ఈ విషయంలో వాళ్లు నిర్ణయం మార్చుకునే అవకాశం కనిపించడం లేదని కేజీవ్రాల్ అన్నారు. దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు మోదీ, షా ద్వయాన్ని అధికారంలో నుంచి దించడమే అని, అందుకే కాంగ్రెస్తో తనకు శతృత్వం ఉన్నా కూడా కూటమికి సిద్ధపడినట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ ద్వయం దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని అన్నారు. పాకిస్థాన్కు 70 ఏళ్లలో సాధ్యంకాని రీతిలో దేశ ఐక్యతను దెబ్బతీశారని, ద్వేషాన్ని పెంచి పోషించారని అన్నారు. వాళ్లు అడ్డుకోవడానికి ఏం చేయడానికైనా సిద్ధమని, అంతేతప్ప కాంగ్రెస్ అంటే ప్రత్యేకమైన ప్రేమ ఏవిూ లేదని కేజీవ్రాల్ స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ తన ఆఫర్ను తిరస్కరించిందని, ఇప్పుడు ఒంటరిగా వెళ్లడం తప్ప మరో మార్గంలేదని ఆయన అన్నారు. అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలను కాంగ్రెస్ బలహీనం చేస్తున్నదని, ఢిల్లీలో మాత్రం ఆమ్ఆద్మీపార్టీయే ఏడుకు ఏడు లోక్సభ స్థానాలను గెలుచుకుంటుందని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో ఇక్కడి ఏడు స్థానాలనూ బీజేపీ గెలుచుకున్న విషయం తెలిసిందే.
–