కాంగ్రెస్‌ నేతల ఇళ్ళల్లో ఐటీ సోదాలు

` పలువురికి అదాయ పన్ను శాఖ అధికారుల నోటీసలు
హైదరాబాద్‌(జనంసాక్షి): ఎన్నికల కాక మీదున్న తెలంగాణలో.. కొత్తగా సోదాల రాజకీయం మొదలయింది. ఇంత వరకూ రోడ్లపై వాహనాల తనిఖీలు జరుగుతుండగా.. ఇప్పుడు కొత్తగా ఆదాయ పన్ను శాఖ అధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇంతకూ ఐటీ రైడ్స్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉందా..? సోదాలపై ఈసీ ఏమంటోంది..? ఇదే అంశం రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషనల్‌గా మారింది. తెలంగాణలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. ప్రధాన పార్టీలు నువ్వా నేనా అనే స్థాయిలో బరిలో పోటీ పడుతున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్‌ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులతో పాటు పలువురు నేతల ఇళ్లలో సోదాలు జరిగాయి. మహేశ్వరం హస్తం పార్టీ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డితో పాటు బడంగ్‌?పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, కాంగ్రెస్‌ నేత లక్ష్మారెడ్డి నివాసాల్లో తనిఖీలు చేశారు ఇన్‌కమ్‌ టాక్స్‌ అధికారులు. దాదాపు 3 కోట్ల రూపాయలను సీజ్‌ చేశారు. కేఎల్‌ఆర్‌ ఇంట్లో రూ. కోటి, లక్ష్మారెడ్డి ఇంట్లో రూ. 2 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోసమే డబ్బు సమకూర్చినట్టు గుర్తించిన అధికారులు, ఈ మేరకు పలు కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఓటమి భయంతోనే తమ పార్టీ నేతలపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ఐటీ దాడులు చేయిస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీని బద్నాం చేయాడానికి కుట్రలు చేస్తున్నారని, వీటిని ధీటుగా ఎదుర్కొంటామని చెబుతున్నారు. అయితే బీజేపీ మాత్రం ఐటీ దాడుల్లో ప్రభుత్వ ప్రమేయం ఉండదని స్పష్టం చేస్తోంది. ఐటీ అధికారులకు ఉన్న సమాచారం మేరకు తనిఖీలు నిర్వహిస్తారని, అందులో ఎవరి పాత్ర ఉండదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెబుతున్నారు. ఎన్నికల్లో ప్రలోభాలను అరికట్టడంతో పాటు నిష్పక్షపాతంగా పోలింగ్‌ జరపాలన్న ఉద్దేశంతో ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోందన్నారు ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌. అందులో ఐటీ దాడులు రెగ్యులర్‌ ప్రాసెస్‌ అని వివరించారు. మరోవైపు, ఆదాయ పన్ను శాఖ అధికారుల దాడులను ధీటుగా ఎదుర్కొంటునే ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది కాంగ్రెస్‌ పార్టీ. ఇందులో భాగంగానే మిషన్‌ తెలంగాణ పేరిట పీసీసీ శిక్షణ కార్యక్రమం చేపట్టింది. కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ సీఎం చవాన్‌తో పాటు తెలంగాణ ఇన్‌ఛార్జి మాణిక్‌ రావు ఠాక్రే పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గాలకు కో-ఆర్డినేటర్లను నియమించిన పీసీసీ, కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించింది. బూత్‌ స్థాయి ఏజెంట్లు, డివిజన్‌ స్థాయి నేతలతో నిత్యం టచ్‌లో ఉండాలని సూచించింది.