కాంగ్రెస్‌ పాపాలకు ఈ ఎన్నికల్లో ప్రజలే శిక్ష వేస్తారు

` తెలంగాణను ఆగం చేసిందే కాంగ్రెస్‌
` రాష్ట్ర మంత్రి కేటీఆర్‌.. ఆగ్రహం
` ‘తెలంగాణలో కాంగ్రెస్‌ పాపాల శతకం’, ‘స్కాంగ్రెస్‌’ పుస్తకాలు ఆవిష్కరించిన మంత్రి
హైదరాబాద్‌(జనంసాక్షి):పూర్వం కవులు శతకపద్యాలు రాసినట్టు, చిత్రగుప్తుడు మనుషుల పాపాల చిట్టా రాసినట్టు.. ఇప్పుడు కాంగ్రెస్‌ పాపాల గురించి శతకాలు, గ్రంథాలు రాయాల్సి వస్తోందన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారాకరామారావు. బీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్‌ విూడియా విభాగం రూపొందించిన ‘‘తెలంగాణలో కాంగ్రెస్‌ పాపాల శతకం’’, ‘‘స్కాంగ్రెస్‌’’ పుస్తకాలను హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌ లో ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రానికి, దేశానికి కాంగ్రెస్‌ పార్టీ తీరని అన్యాయం చేసిందని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక అత్యధిక కాలం పాలించిన పార్టీ… దేశాన్ని పూర్తిగా గాలికి వదిలేసి దోచుకోవడమే పనిగా పెట్టుకుందన్నారు. ఆ పాపాల చిట్టాలను రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలు తెలియజేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై, తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ తెలంగాణకు చేసిన ద్రోహాన్ని, దేశంలో చేసిన స్కాములను పుస్తకరూపంలో తీసుకొచ్చిన సోషల్‌ విూడియా విభాగాన్ని ఆయన అభినందించారు.తెలంగాణకు కాంగ్రెస్‌ శతాధిక ద్రోహం..అత్యధిక కాలం పాటు రాష్ట్రాన్ని పాలించి కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రాంతానికి చేసిన ద్రోహం, అన్యాయాలను వివరిస్తూ ‘‘తెలంగాణలో కాంగ్రెస్‌ పాపాల శతకం’’ అనే పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. హైదరాబాద్‌ స్టేట్‌ ను ఆంధ్రా ప్రాంతంతో కలపడం మొదలు.. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు బలిగొన్న యువకులు, ఉద్యమకారుల గురించి ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. కాంగ్రెస్‌ పాలనలో కరెంటు కష్టాలు, నీళ్ల కష్టాలు, అన్నదాతల కన్నీరు, ఆత్మహత్యలు, నేతన్నల ఉరితాళ్లు, పదవుల కోసం పాకులాడుతూ.. సాగునీటి రంగంలో తెలంగాణకు కాంగ్రెస్‌ చేసిన అన్యాయం, సుసంపన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ఎలా పడావుబెట్టిందనే విషయాలను ఇందులో తెలియజేయడం జరిగింది. ఇలాంటి ‘‘కాంగ్రెస్‌ కు ఎందుకు ఓటేయాలి..? అని ఆ పార్టీని ప్రశ్నించడం జరిగింది. ఏ టూ జెడ్‌ స్కాముల పార్టీ.. కాంగ్రెస్‌ పార్టీ అంటేనే స్కాముల పార్టీ అనే పేరుంది. కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో చేసిన ం టూ జి స్కాముల గురించి ‘‘స్కాంగ్రెస్‌’’ పుస్తకంలో వివరించడం జరిగింది. అక్రమార్కులకు, దోపిడీ దారులకు, స్కామర్లకు అండగా ఉండి లక్షల కోట్ల కుంభకోణాలకు కారణమైంది కాంగ్రెస్‌ పార్టీ. ఆ రంగం, ఈ రంగం అని లేదు.. బొగ్గు నుంచి కామన్‌ వెల్త్‌ గేమ్స్‌ దాకా దేన్నీ వదల్లేదు. చివరకు ఆర్మీ వాహనాల కొనుగోలులోనూ తమ కక్కుర్తి ప్రదర్శించింది. అగస్టా వెస్ట్‌ లాండ్‌ స్కాం, బోఫోర్స్‌ స్కాం, ఆర్మీ వాహనాల కొనుగోలు స్కాం, కోల్‌ స్కాం, 2జీ స్కాం, ఇలా చెప్పుకుంటూ పోతే  ‘‘స్కాంగ్రెస్‌’’ చిట్టా చాలా పెద్దగా ఉంటుంది. ఆ వివరాలన్నీ ‘‘స్కాంగ్రెస్‌’’ పుస్తకంలో వివరించడం జరిగింది. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ సోషల్‌ విూడియా కన్వీనర్లు వై.సతీష్‌ రెడ్డి, జగన్‌ మోహన్‌ రావు, దినేష్‌ చౌదరి,మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, సీనియర్‌ నాయకులు దాసోజు శ్రవణ్‌, రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.