కార్తీ చిదంబరానికి ఊరట!
– విదేశాలకు వెళ్లేందుకు షరతులతో సుప్రిం అంగీకారం
న్యూఢిల్లీ, జనవరి30(జనంసాక్షి) : మాజీ కేంద్రమంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి సుప్రింకోర్టు స్వల్ప ఊరట లభించింది. ఐఎన్ఎక్స్ విూడియా, ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసుల్లో కార్తీపై విచారణ జరుగుతుంది. దీంతో ఆయన విదేశాలకు వెళ్లాలంటే తప్పని సరి తమ అనుమతి కావాలని గతంలో సుప్రిం ఆదేశించింది. దీంతో విదేశాలకు వెళ్లేందుకు కార్తీ సుప్రీని కోరారు. దీంతో కార్తీ విదేశాలకు వెళ్లేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే ఇందుకు కొన్ని షరతులు విధించింది. సుప్రీంకోర్టు రిజిస్టర్ర్లో రూ. 10కోట్లు జమ చేసి కార్తీ విదేశాలకు వెళ్లొచ్చని న్యాయస్థానం తెలిపింది. అయితే విచారణకు మాత్రం సహకరించాలని కోర్టు స్పష్టం చేసింది. ‘ఫిబ్రవరి 10 నుంచి 26 మధ్య విూరు ఎక్కడికి వెళ్లాలనుకుంటే అక్కడకు వెళ్లొచ్చని, కానీ విచారణకు మాత్రం తప్పకుండా సహకరించాలని సుప్రిం సూచించింది. చట్టాలతో ఆడుకోవాలని చూడొద్దని, ఎయిర్సెల్ మ్యాక్సిస్, ఐఎన్ఎక్స్ విూడియా కేసులో మార్చి 5, 6, 7, 12 తేదీల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. ఒకవేళ విూరు విచారణకు సహకరించకపోతే మేం చాలా చెప్పాల్సి ఉంటుందని తెలిపింది. ప్రస్తుతమైతే విూరు వెళ్లొచ్చని, అయితే అందుకోసం సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో రూ. 10కోట్లు జమ చేయాల్సి ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అంతర్జాతీయ టెన్సిస్ టోర్నమెంట్ల కోసం కొద్ది నెలల పాటు ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కార్తీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 10 నుంచి 26, మార్చి 23 నుంచి 31 మధ్య తాను విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కావాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఫిబ్రవరి 10 నుంచి 26 మధ్య మాత్రమే కార్తీ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.



