కేంద్రంపై మళ్లీ తెదేపా అవిశ్వాస అస్త్రం

– పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చిన తెదేపా ఎంపీలు

న్యూఢిల్లీ, జులై17(జ‌నం సాక్షి) : ఆంధప్రదేశ్‌ రాష్ట్ర విభజన హావిూల సాధన పోరాటంలో తెదేపా మరో అడుగు ముందుకేసింది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో తెదేపా మళ్లీ కేంద్రంపై అవిశ్వాస అస్త్రాన్ని సంధించింది. విభజన హావిూల సాధన కోసం కేంద్రంపై పోరాటాన్ని తీవ్రతరం చేసిన తెదేపా మంగళవారం తాజాగా లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చింది. ఇప్పటికే ఆ పార్టీ ఎంపీలు పలు రాష్ట్రాల్లో పర్యటించి ఆయా పార్టీల నేతలతో భేటీ అయి తమకు మద్దతుగా నిలవాలని కోరుతూ చంద్రబాబు రాసిన లేఖను వారికి అందజేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తెదేపా ఎంపీ కేశినేని నాని మంగళవారం కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. బుధవారం జరిగే సభా కార్యకలాపాల జాబితాలో ఈ అవిశ్వాస తీర్మానాన్ని చేర్చాలని కోరారు. రాష్ట్ర విభజన హావిూల సాధనే లక్ష్యంగా గతంలో జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో తెదేపా, వైకాపా సభ్యులు పోటాపోటీగా పలుమార్లు అవిశ్వాస తీర్మానాలు ఇచ్చినప్పటికీ అన్నాడీఎంకే సభ్యులు కావేరీ బోర్డు కోసం చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో సభ ఆర్డర్‌లో లేదంటూ సభాపతి సుమిత్రా మహాజన్‌ చెప్పడం, సభ్యులు ప్లకార్డులతో నినాదాలు చేయడంతో వాయిదాల పరంపరతో సభా కార్యకలాపాలు స్తంభించిన విషయం తెలిసిందే. తాజాగా తెదేపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానంతో ఈ వర్షాకాల సమావేశాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే దానిపై ఆసక్తి నెలకొంది.