కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు శుభవార్త

– 2శాతం డీఏ, ఫించనుదారులకు డీఆర్‌ పెంపుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

– 1.1కోట్ల మంది ఉద్యోగులకు, పెన్షన్‌ దారులకు లబ్ధి

న్యూఢిల్లీ, ఆగస్టు29(జ‌నం సాక్షి) : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగులకు 2శాతం కరువు భత్యం(డీఏ), ఫించనుదారులకు డీఆర్‌ను పెంచేందుకు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ పెంపు ద్వారా 1.1కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. డీఏ పెంచుతున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. జులై 1, 2018 నుంచి ఈ పెంపు ఉద్యోగులకు వర్తించనుంది. డీఏ పెంపు ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6,112.20కోట్లు, డీఆర్‌ పెంపు వల్ల రూ.4,074.80కోట్ల మేర ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడనుంది. ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2శాతం డీఏ, పెన్షనర్లకు డీఆర్‌ పెంచేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈపెంపు ద్వారా 48.41లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 62.03లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది.