కేవలం రూ.13కే రుణమాఫీ

– కంగుతిన్న రైతు కటారియా

– ప్రభుత్వ నిబంధనల ప్రకారమే చేశామన్న అధికారులు

బోపాల్‌, జనవరి24(జ‌నంసాక్షి) : గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఎన్నికలతో మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్‌. సీఎం కమల్‌నాథ్‌ రైతుల రుణమాఫీ ఫైలుపై తన తొలి సంతకం చేశారు. అయితే ఓ రైతుకు దాదాపు రూ.24 వేల రుణమాఫీ కావాల్సి ఉండగా కేవలం రూ.13మాత్రమే మాఫీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అధికారంలోకి వస్తే రూ.2 లక్షల మేర రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ హావిూలు ఇచ్చింది. బైజ్‌నాథ్‌ నిపానియా గ్రామానికి చెందిన రైతుల రుణమాఫీ జాబితాను ఇటీవల విడుదల చేశారు. శివ్‌లాల్‌ కటారియా అనే రైతు తనకు మాఫీ అయిన నగదు మొత్తాన్ని చూసి కంగుతిన్నారు. తనకు రూ.23,815 మేర రుణం ఉంది. మొత్తం మాఫీ అవుతుందని భావించగా కేవలం రూ.13 మాఫీ చేశారని దీనిపై అధికారులను ప్రశ్నించాడు. రుణమాఫీ ప్రకటించిన తేదీ వరకు కటారియా పేరు విూద కేవలం రూ.13 రుణం ఉందని, అందుకే ఆ మేరకు మాఫీ చేసినట్లు అధికారులు చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న రైతుల రుణమాఫీలో అవకతవకలు జరుగుతున్నాయని రైతు కటారియా ఆరోపించారు. దీనిపై రాష్ట్ర మంత్రి ఓంకార్‌ సింగ్‌ మార్‌క్రమ్‌ స్పందించారు. హావిూ ఇచ్చినట్లుగా రూ.2 లక్షల మేర రుణాలు మాఫీ అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, రైతులు తమ రుణాల వివరాలు వెల్లడిస్తూ, రుణమాఫీ కోసం జనవరి 15 నుంచి ఫిబ్రవరి 5 తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఫిబ్రవరి 22 నుంచి రుణాల మొత్తం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 55 లక్షల మంది రైతులు రుణమాఫీతో లబ్ది పొందనున్నారు.