కోటప్పకొండకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు 

గుంటూరు,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి):  కోటప్పకొండ తిరునాళ్ల సందర్బంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.  రెండు మూడు రోజుల పాటు భారీ సంఖ్యలో బస్సులను తిప్పుతారు.  గుంటూరు నుంచి  చిలకలూరిపేట విూదుగా కోటప్పకొండకు చేరుకునే వీలుంది. గుంటూరు నుంచి నరసరావుపేట విూదుగా కోటప్పకొండకు వెళ్లవచ్చు.అటు చిలకలూరిపేట రోడ్డులో, ఇటు నరసరావుపేట వైపు కూడా ప్రత్యేకంగా బస్‌స్టేషన్‌ ఏర్పాటు చేసారు. వందలాది బస్సులు వెంట వెంటనే తిరుగుతుంటాయి. రాత్రి అయ్యేసరికి కొండ వద్ద జనసంద్రమై ఉంటుంది.కార్తీకమాసంలో కొండ పైకి సోమవారం, ఆదివారం రోజుల్లో బస్సులు తిరుగుతాయి. నరసరావుపేట, కోటప్పకొండ, చిలకలూరిపేటకు నిత్యం బస్సులు తిరుగుతుంటాయి.  రాయలసీమ, వినుకొండ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు నరసరావుపేట మండలం పెట్లూరివారి పాలెం వద్ద నుంచి కుడివైపునకు మళ్లి కొండకు చేరవచ్చు. తిరునాళ్ల రోజు ప్రభుత్వపరంగా అన్ని శాఖల స్టాళ్లు పెట్టడం కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. తిరునాళ్లకు వచ్చిన రైతాంగానికి ప్రభుత్వ పథకాల గురించి తెలియజేస్తారు. భద్రత పరంగా కోటప్పకొండకు పోలీసు అధికారుల ప్రత్యేక క్యాంప్‌ ఏర్పాటవుతోంది. పోలీసు అధికారుల కోసం ప్రత్యేకంగా గుడారాలు నిర్మించారు.