ఖండాంతరాలు దాటిన ప్రేమ
– వివాహంతో ఒక్కటైన జర్మనీ అమ్మాయి, ఖమ్మం యువకుడు
– హిందూ సాంప్రదాయం ప్రకారం ఘనంగా పెండ్లి తంతు
ఖమ్మం, ఆగస్టు31(జనం సాక్షి) : ప్రేమకు కులం లేదు మతం లేదు ఇప్పుడు దేశం కూడా లేదని నిరూపించింది ఈ జంట. ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడు జర్మనీకి చెందిన అమ్మాయిని వివాహమాడి తన ప్రేమను ఖండాంతరాలు దాటించాడు. ఇరువురు పెద్దల సమక్షంలో తన ప్రేయసిని పెండ్లి చేసుకొని ఆ ప్రాంతంలో చర్చనీయాంశమయ్యాడు. బోనకల్లు మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన కొత్తపల్లి నిర్బంధన్, లక్ష్మీ దంపతుల పెద్ద కొడుకు క్రాంతి బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఎంఎస్ చేయడం కోసం జర్మనీ వెళ్లాడు. ఎంఎస్ అయిపోయాక అక్కడే ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. పనిచేసే కంపెనీలో లైనా రైబర్గ్ అనే యువతితో ప్రేమలో పడ్డాడు. లైనా కూడా అతడిని ప్రేమించింది. దీంతో వీరి ప్రేమ విషయాన్ని తమ తల్లిదండ్రులకు తెలపగా… వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెద్దల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం వేద మంత్రాల నడుమ తన ప్రేయసి మెడలో తాళి కట్టాడు. వివాహ వేడుక వరుడి ఇంటి వద్ద జరుగగా.. వేడుకకు వచ్చిన బంధువులు, గ్రామస్తులు పెండ్లిని ఆసక్తిగా తిలకించి నూతన దంపతులను ఆశీర్వదించారు.