ఖమ్మంలో భారీ పేలుడు: ముగ్గురికి తీవ్ర గాయాలు

ఖమ్మం,అక్టోబర్‌29(జ‌నంసాక్షి): ఖమ్మం జిల్లాలో సోమవారం తెల్లవారుజామున భారీ పేలుడు జరిగి అగ్నిప్రమాదం సంభవించింది. భారీ పేలుడు సంభవించడంతో స్థానికులు భయంతో వణికిపోయారు.ఈ ఘటనలో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. చుట్టుపక్కల ఇళ్లు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. నగరంలోని కమాన్‌ బజార్‌లో ఈ ఘటన జరిగింది. పేలుడు శబ్దానికి దగ్గరలోని ఇళ్లు దెబ్బతిన్నాయి. అగ్నిప్రమాదానికి గురైన దుకాణం షెటర్లు దూరాన ఎగిరిపడ్డాయి. గోడలు కూలిపోయాయి. ఘటనాస్థలం వద్ద భయానక వాతావరణం నెలకొంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ వెంకట్రావు ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దర్యాప్తులో నిజానిజాలు తేలుస్తామని ఆయన తెలిపారు.