గడ్కరీని అభినందించిన సోనియాగాంధీ!
– మౌలిక వసతుల అభివృద్ధికి అద్భుతంగా పనిచేశారంటూ కితాబు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి7(జనంసాక్షి) : కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పనితీరుపై యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ప్రశంసలు కురిపించారు. దేశంలోని మౌలిక వసతులను అభివృద్ధి చేయడంలో ఆయన ‘అద్భుతంగా’ కృషిచేశారన్న దానిపై ఆమె ఏకీభవించారు. లోక్సభలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో… గడ్కరీ మంత్రిత్వ శాఖకు సంబంధించిన రెండు ప్రశ్నలపై చర్చ జరిగింది. దేశంలోని రహదారుల విస్తరణపై అమలు చేసిన పథకాలు, చేపట్టనున్న పనులపై ఆయన పూర్తి వివరణ ఇచ్చారు. ‘తమ తమ నియోజకవర్గాల్లో నా మంత్రిత్వ శాఖ చేపడుతున్న పనులపై పార్టీలకతీతంగా ఎంపీలు నన్ను మెచ్చుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. గడ్కరీ మాట్లాడుతున్నంత సేపూ సోనియా గాంధీ నవ్వుతూ, తలూపుతూ కనిపించడం విశేషం. బీజేపీ సభ్యుల హర్షధ్వానాల మధ్య గడ్కరీ తన ప్రసంగాన్ని ముగించగానే… మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ గణెళిశ్ సింగ్ లేచి నిలబడి ఓ ప్రతిపాదన చేశారు. ‘కేంద్ర రోడ్డు రవాణా మంత్రి చేపట్టిన అద్భుతమైన పనులను సభలోని సభ్యులంతా మెచ్చుకోవాలంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్కు విన్నవించారు. దీంతో సోనియా కూడా మెచ్చుకోలుగా బల్లలు చరవడం మొదలు పెట్టారు. ఆమెను చూసి లోక్సభలో కాంగ్రెస్ సభాపక్షనేత మల్లికార్జున ఖర్గే సహా ఆ పార్టీ ఎంపీలంతా గడ్కరీ సేవలను మెచ్చుకుంటూ బల్లలు చరిచారు. కాగా రాయ్బరేలీ నియోజకవర్గ సమస్యలపై ‘సానుకూలంగా’ స్పందించినందుకు గతేడాది ఆగస్టులో సోనియా గాంధీ నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు చెబుతూ లేఖ రాసినట్టు వార్తలు వచ్చాయి. ఉత్తర ప్రదేశ్లోని రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి సోనియా గాంధీ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.