గాంధీ అంటే .. కదల్లేని విగ్రహం కాదు


– కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ
– రాజ్‌ఘాట్‌లో గాంధీ సమాది వద్ద నివాళులర్పించిన సోనియా, రాహుల్‌
న్యూఢిల్లీ, అక్టోబర్‌2(జ‌నంసాక్షిఎ) : గాంధీజీ అంటే కదల్లేని విగ్రహం కాదని.. దేశమంతా విస్తరించిన విలువలు, జీవించి ఉన్న ఆలోచనలు అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. మంగళవారం మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా రాహుల్‌ గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ రాజ్‌ఘాట్‌లో గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. గాంధీ జయంతి సందర్భంగా రాహుల్‌ ట్విటర్‌లో గాంధీ ఫొటోతో పాటుగా ట్వీట్‌ చేశారు. ‘గాంధీజీ అంటే కదలలేని విగ్రహం కాదు, దేశమంతా విస్తరించి ఉన్న విలువలు, జీవించి ఉన్న ఆలోచనలు. సత్యం, అహింస.. వీటి కోసమే ఆయన జీవించారు, దేశం కోసం చనిపోయారు. నిజమైన దేశ భక్తులు ఆయన విలువలను కాపాడాలని రాహుల్‌ ట్వీట్‌లో వెల్లడించారు. రాజ్‌ఘాట్‌లో నివాళులర్పించిన అనంతరం రాహుల్‌, సోనియా ఇద్దరూ వెంటనే వెనుదిరిగారు. అదేవిధంగా ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్‌తో పాటు రాజ్‌ఘాట్‌ వద్ద భాజపా సీనియర్‌ నేత ఎల్‌కే అడ్వాణీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌, ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ తదితర ప్రముఖులు మహాత్మునికి నివాళులర్పించారు.