గుణాత్మక మార్పులకు దూరంగా పాలన

ప్రజలను గట్టెక్కించలేకపోతున్న మోడీ విధానాలు

నోట్లరద్దు, జిఎస్టీ ప్రభావాలను గుర్తించని పాలకులు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): దేశ చరిత్రలో 70 ఏళ్లు అంటే తక్కువ సమయమేవిూ కాదని ఇటీవల తెలంగాణ సిఎం కెసిఆర్‌ పదేపదే చెబుతున్నారు. గుణాత్మక రాజకీయాలు రావాలని అంటున్నారు. అయినా మార్పు రావడం లేదని, చర్యలు తీసుకోవడం లేదని తాజాగా రాజకీయ పరిస్థితి చూస్తే అర్థం అవుతుంది. బిజెపిలో అంతర్గ ప్రజాస్వామ్యం లోపించడం, పెద్దల ఆలోచనలను తీసుకోవడం లాంటి సంప్రదాయాలకు చెక్‌ పడింది. భారతీయజనతాపార్టీ వ్యవహారాలన్నీ ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ చుట్టూనే పరిభ్రమి స్తున్నాయి. పార్టీలో ఆయన అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో స్వేచ్ఛాఫలాలు సామాన్యుడి చెంతకు చేరలేదని నిత్యం ఘోషిస్తున్నా పాలకులకు పట్టడం లేదు. ఆనాటి ప్రధాని మన్మోహన్‌ను మౌనముని అంటూ నిందించిన మోడీ ఇప్పుడు తానే అతిపెద్ద మౌనమునిగా మారారు. ఏ సమస్యపైనా స్పందించడం లేదు. పార్లమెంటు లోపలా, వెలుపలా కూడా నోరు విప్పడం లేదు. దీంతో సమస్యలను దాటవేసే ధోరణి కనిపిస్తోంది. అన్నిరంగాలను నిర్వీర్యం చేసి కార్పొరేట్లకు సలాం కొడుతున్న ఆత్మగౌరవ రాహిత్యం తాండవిస్తోంది. జిఎస్టీ, నోట్ల రద్దు ప్రభావాలు వేధిస్తున్నా వాటి గురించి గొప్పలు చెప్పుకోవడం దారుణం కాక మరోటి కాదు. అడుగడుగునా పాలనా వైఫల్యం కనిపిస్తున్నా దానిగురించి కప్పిపుచ్చుకుంటూ ప్రచారార్భాటలు చేయడం అలవాటుగా మారింది. అంబానీలు, అదానీల అంతులేని ధనదాహానికి దోహదం చేయడం తప్ప సాధించేదేవిూ లేదని గుర్తించుకోవాలి. అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తామని అధికారం చేపట్టిన తొలినాళ్లలో ప్రధాని మోడీ ప్రకటించారు. గత నాలుగేళ్లుగా మోడీ చెబుతున్న ఏ ఒక్కటి కూడా కార్యాచరణకు రావడం లేదు. అవినీతిని అంతమొందించే క్రమంలో చిత్తశుద్దితో సాగితే ప్రజలు అండగా ఉంటారని గుర్తించాలి. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తరవాత ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. తమ బతుకుల్లో మార్పు వస్తుందని భావించారు. కానీ అలాంటి సందర్భాలు రాలేదు. నోట్లు రద్దు చేసినా, జిఎస్టీ వాతలు పెట్టినా భరిస్తున్నారు. ఈ భరింపు ఎంతకాలం అన్నది ప్రధాని మోడీ ఆలోచించు కోవాలి. జీఎస్టీతో కొత్త చరిత్ర సృష్టించామని.. కొత్త పన్ను విధానానికి అందరి మద్దతు లభిస్తోందని చెప్పుకుంటూ ఎంతకాలం ప్రజలను వంచన చేస్తారన్నది చూడాలి. ప్రజలకు కూడా ఓపిక నశిస్తోందని గుర్తించకపోతే మొదటికే మోసం వస్తుంది. గుజరాత్‌ నుంచి తనకు అత్యంత నమ్మకస్తుడైన అమిత్‌ షాను ఏరికోరి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తెచ్చుకోగలిగారు. ఇక ఆ తరవాత ఆ ఇద్దరే దేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మోదీ సొంతబలంతో సర్కారును నడుపుతున్న కారణంగా నాటి ఎన్‌డీఏ ప్రభుత్వం మాదిరిగా సమిష్టి నిర్ణయాలకు తావీయడం లేదు. పేరకు ఎన్‌డిఎ అంటున్నా అంతా మోడీ నిర్ణయాలే సాగుతున్నాయి. మిత్రపక్షాలతో ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో ముందుకు సాగే సంప్రదాయాన్ని పక్కన పెట్టారు. బ్యాంకుల విశ్వసనీయతను దెబ్బతీయడంతో డబ్బులు వేయాలనుకునే వారు వాటి జోలికి పోవడం లేదు. నాలుగేళ్ల పాలన తరవాత కూడా తాను దేశాన్ని ఏ దిశగా తీసుకెళుతున్న సంగతిని ప్రధాని మోడీ గుర్తించడం లేదు. దేశంలో జరుగుతున్న పరిణామాలను గమనిం చడం లేదు. క్షేత్రస్థాయిలో ప్రజల మనోగతాలను తెలుసు కోవడం లేదు. తాను గొప్పగా ప్రవచిస్తున్న నోట్లరద్దు, జిఎస్టీ విపరిణామాలను గుర్తించడం లేదు. దీంతో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. దేశంలో అరాచక పరిస్థితి నెలకొంది. బ్యాంకుల దోపిడీ, అత్యాచారాలు, హత్యలు విచ్చలవిడిగా సాగుతున్నాప్రభుత్వం ఉందన్న భయం లేకుండా పోయింది. ప్రభుత్వం పథకాల పేర్లు చెప్పి చాంతాడంత జాబితాను వల్లెవేస్తోందే తప్ప ప్రజలకు నేరుగా ప్రయోజనం కలిగించే పనులేవీ జరగడం లేదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదు. ఈ దేశాన్ని గాడిలో పెడతామన్న వారు గాడితప్పేలా చేశారు.. నోట్లరద్దు, జిఎస్టీ వల్ల దేశంలో మార్పు వచ్చిందని ఘనంగా చెబుతున్న ప్రధాని మోడీ దాని విపరీత పరిణామాలను పరిగణించడం లేదనడానికి ప్రస్తుత ఫలితాలే నిదర్శనం. జీఎస్టీని తీసుకొచ్చి సహకార వ్యవస్థకు జవసత్వాలు అందించామంటూ జీఎస్టీని ఇంత తక్కువ సమయంలో ఎలా అమలు చేశారని ప్రపంచం ఆశ్చర్య పోతోందన్నారు. నిజంగా అమలు చేయాలను కుంటున్న విషయాల్లో ఖచ్చితంగా ఉంటూ, మిగతా విషయాల్లో చట్టాలను అపహాస్యం చేస్తున్నారు.