చత్తీస్‌గఢ్‌లో మవోయిస్టుల పంజా

– బిజెపి ఎమ్మెల్యే కాన్వాయ్‌పై దాడి
– ఎమ్మెల్యే సహా ఐదుగురు  మృతి
రాయ్‌పూర్‌,ఏప్రిల్‌ 9(జనంసాక్షి): చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. దంతేవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి కాన్వాయ్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే మాండవితో పాటు ఐదుగురు పోలీసులు మృతి చెందారు. సార్వత్రిక ఎన్నికల వేళ మావోయిస్టులు పంజా విసిరారు. చత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మావోలు జరిపిన దాడిలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే భీమా మాండవి మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఐదుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు.లోక్‌ సభ ఎన్నికల్లో భాగంగా దంతెవాడకు ప్రచారానికి వెళ్తున్న భాజపా ఎమ్మెల్యే వాహన శ్రేణిపై పేలుడు పదార్థాలు విసిరారు. ఈఘటనలో మాండవితో పాటు మరో ఐదుమంది అక్కడికక్కడే మృతి చెందగా కాన్వాయ్‌లో ఉన్న పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని సవిూప ఆసుపత్రికి తరలించారు. ఛత్తీస్‌గఢ్‌లో మూడు దశల్లో లోక్‌ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 11, ఏప్రిల్‌ 18, 23 తేదీల్లో పోలింగ్‌ జరగనుంది.కౌకొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శ్యామ్‌గిరిలో ఈ దాడి జరిగింది. ఐఈడీ పేలడంతో కాన్వాయ్‌లోని వాహనం తునాతునకలైంది. ఘటన జరిగిన వెంటనే సీఆర్పీఎఫ్‌ బలగాలు అక్కడికి వెళ్లాయి. కాన్వాయ్‌లో ఎమ్మెల్యే చివరి వాహనంలో ఉన్నట్లు తెలిసింది.  ఐఈడీని పేల్చిన వెంటనే మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. తొలి విడత జరిగే రెండు రోజుల ముందే మావోయిస్టులు దాడి చేయడం ఆందోళన కలిగిస్తున్నది.