జర్నలిస్ట్‌ నుంచి డిప్యూటీ ఛైర్మన్‌

– అంచెలంచెలుగా ఎదిగిన హరివంశ్‌ నారాయణ్‌
న్యూఢిల్లీ, ఆగస్టు9(జ‌నం సాక్షి) : జర్నలిస్ట్‌ నుంచి అంచెలంచెలుగా ఎదిగిన హరివంశ్‌ నారాయణ్‌ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నియయ్యారు.  హరివంశ్‌ స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని భలియా. మధ్యతరగతి కుటుంబంలో 1956 జూన్‌ 30న జన్మించారు. మంచి విద్యావంతులు. బెనారస్‌ హిందూ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పీజీ పట్టా అందుకున్నారు. కెరియర్‌ ప్రారంభంలో నెలకు రూ. 500 వేతనానికి పనిచేశారు. పలు న్యూస్‌ సంస్థలకు ఎడిటర్‌గా పనిచేశారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్‌కు విూడియా సలహాదారుగా వ్యవహరించారు. జేడీయూ జనరల్‌ సెక్రటరీ ఇన్‌ఛార్జీగా వ్యవహరించారు.  మూడుసార్లు రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. సోషలిస్ట్‌ నాయకుడు జయప్రకాశ్‌ నారాయణ్‌ ప్రభావంతో 1974లో జేపీ చేపట్టిన ఉద్యమంలో చురుకుగా పాలుపంచుకున్నారు. 1977లో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో ట్రైనీ జర్నలిస్ట్‌గా చేరారు. అనంతరం ముంబయికి మారి ధర్మయుగ్‌ మ్యాగజైన్‌లో 1981 వరకు పనిచేశారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 1981 నుంచి 1984 వరకు అనంతరం అమృత్‌ బజార్‌ పత్రిక మ్యాగజైన్‌ రవివార్‌కు అసిస్టెంట్‌ ఎడిటర్‌గా, ప్రభాత్‌ కబర్‌కు ఎడిటర్‌గా 25 ఏండ్లు పనిచేశారు. నితిశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ హరివంశ్‌ను 2014లో రాజ్యసభకు నామినేట్‌ చేసింది.