టిడిపిలో చేరిన టిఆర్ఎస్ నాయకులు
తెలంగాణను కాపాడుకోవాలన్న సండ్ర
సత్తుపల్లి,అక్టోబర్11(జనంసాక్షి): కేసీఆర్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెదేపా సత్తుపల్లి అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఆయన సమక్షంలో టిఆర్ఎస్కు చెందిన పలువురు గురువారం టిడిపిలో చేరారు. టిడిపినే గెలపించుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా వారిని సండ్ర టిడిపిలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్రమంతటా కేసీఆర్ పాలనపై వ్యతిరేకత ఉందన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న 54 అంశాల్లో ఏ అంశాలు అమలు చేశారో చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ¬దా ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్లో రూ.80 వేల కోట్లను ఖర్చుచేసి ప్రాజెక్టులను నిర్మించడంలో ఆంతర్యమేమిటో భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్రావు చెప్పాలన్నారు. ఏ రంగంలో ఏ పనులు చేపట్టారో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఏ లక్ష్యం కోసం కోసం రాష్ట్రాన్ని సాధించుకున్నామో విస్మరించిన తెరాస గడీల పాలన సాగించిందన్నారు. రాష్ట్రంలో తెదేపానే లేదన్న తెరాస నాయకులు నేడు మహాకూటమిలోకి తెదేపా వస్తే ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. తెరాసకు గుణపాఠం చెప్పేది తెదేపానే అని, రాష్ట్రంలో తెదేపా బలంగానే ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కెసీఆర్ కుటుంబ పాలన నుంచి కాపాడడమే లక్ష్యంగా మహాకూటమి ఏర్పడిందన్నారు.